హైదరాబాద్ లోని పటాన్చెరులోని చైతన్యనగర్ కాలనీకి చెందిన రవికుమార్ (28) బెంగళూరు ఇన్ఫోసిస్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. లాక్డౌన్ వల్ల పటాన్చెరులోని ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రవికుమార్ ఆన్లైన్ బెట్టింగ్ల వైపు తొంగిచూశాడు. బెట్టింగ్ల డబ్బులు పోవడం మొదలయ్యాయి. తీవ్రంగా అప్పుల పాలయ్యాడు. ఆ విషయం తెలిసి రవి తండ్రి ప్రభాకర్ దాదాపు లక్ష రూపాయల అప్పు తీర్చాడు. అయినా బెట్టింగ్ డబ్బుల కోసం చేసిన అప్పులు పూర్తిగా తీరలేదు. అన్ని డబ్బులు ఎలా తేవాలా.? అని మదనపడుతూ తల్లడిల్లిపోయాడు.
తన కారణంగా కుటుంబం కూడా ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని మరింత వేదనకు గురవుతూ రోజులు గడుపుతున్నాడు రవి. ఈ క్రమంలోనే రవి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి విధులకు వెళ్లగానే బెడ్ రూమ్లో చీరతో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన రవి తల్లి, అతడిని రక్షించేందుకు సాయం కోసం పక్కింటి వారిని పిలిచింది. అందరూ కలిసి రవిని హుటాహుటిన దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే రవిని వైద్యులు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమనడంతో అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు అప్పటికే రవి మరణించాడని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చేతుకొచ్చిన కుమారుడు కళ్లముందే విగత జీవిగా మారడాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.