కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ని 2014లో ఏర్పాటు చేశారు. ఇది కేంద్ర జలవనరుల శాఖ పరిధిలో ఉండే స్వయంప్రతిపత్తి గల సంస్థ. ఈ బోర్డు హైదరాబాద్లోనే ఉంది. అయితే విభజన చట్టం ప్రకారం ఏపీలో మరో బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కృష్ణా బోర్డుని విజయవాడలో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. కానీ ఆ ప్రక్రియ జరగలేదు.
ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖపట్నానికి తరలించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే కేఆర్ఎంబీని విశాఖ తరలించేందుకు బోర్డు అంగీకరించింది. అయితే, ఈ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా నదికి సంబంధం లేని విశాఖలో బోర్డు ఏర్పాటు తగదని వాదిస్తున్నారు. ఏపీలో వైసీపీ మినహా అన్నీ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పైగా రాయలసీమ ప్రాంత రైతులు కర్నూలులో బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ సర్కార్ సైతం ఈ విషయంలో అభ్యంతరాలు పెడుతుంది. మొదట విజయవాడలో బోర్డు పెడతామంటే అంగీకరించామని, ఇప్పుడు అసలు కృష్ణా బేసిన్తో సంబంధం లేని విశాఖలో ఏర్పాటు చేస్తామంటే అంగీకరించమని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్కు లేఖ రాశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రక్రియ ఒప్పుకునే ప్రసక్తి లేదని తెలంగాణ చెప్పేస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్లైతే విశాఖలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం కాదేమో.