తెలంగాణ వైతాళికులు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత సురవరం ప్రతాపరెడ్డి 125 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్  అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు  సురవరం ప్రతాపరెడ్డి  జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సురవరం సాహిత్య, చరిత్ర పరిశోధన, జర్నలిజం లాంటి రంగాలలో చేసిన సేవలను నేటి తరానికి అందించేందుకు తెలంగాణ సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మే 28న సురవరం జయంతిని పురస్కరించుకుని ఆయన స్వగ్రామం అలంపూర్ చౌరస్తాలో గాని లేదా ఇటిక్యాల వద్ద సురవరం ప్రతాపరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అందుకు స్థల పరిశీలన చేయాలని  అధికారులను మంత్రి ఆదేశించారు.

సురవరం ప్రతాప్ రెడ్డి రచించిన కథలను, నాటకీకరించి నాటకోత్సవాల ను సంగీత నాటక అకాడమీ ద్వారా నాటకాలుగా ప్రదర్శించేలా కార్యక్రమాలను నిర్వహించాలని  అధికారులకు సూచించారు హైదరాబాద్ తో పాటు పాటు ఉమ్మడి 10  జిల్లా కేంద్రాలలో కవి సమ్మేళనాలు,  సాహితీ చర్చలు మేధావులతో  అలానే వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి  జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా పుస్తక ప్రదర్శనలు నిర్వహించాలని అన్నారు. సురవరం ప్రతాప రెడ్డి చేసిన సేవలను నేటి తరానికి తెలిసేలా వివిధ పత్రికలు ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం లభించేలా మీడియా సంస్థల ఎడిటర్లతో సమావేశం నిర్వహించాలని... వీటితో పాటు షార్ట్ ఫిలిమ్స్,వీడియో కంటెస్ట్ లు నిర్వహించాలని అన్నారు.

 తెలుగు యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీలలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి సాహిత్య కృషి మీద చర్చలు జరపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడం పై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు . వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరుతో రాష్ట్ర స్థాయి అవార్డు ఇచ్చేందుకు ఒక కమిటీని నియమించేలా చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: