కమలా హారిస్ తల్లి భారతీయురాలు. తండ్రి జమైకా దేశస్థుడు. తమిళనాడుకు చెందిన కమల తల్లి శ్యామలా గోపాలన్.. 1960లో అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిర పడ్డారు. ఆమె న్యూట్రిషన్.., ఎండోక్రినాలాజీలో పరిశోధన కోసం అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్తో ఆమెకు ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలో కమలా దేవి హ్యారిస్ జన్మించారు. కమల.. తాతగారు పీవీ గోపాలన్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు. చిన్నతనంలో తరచూ చెన్నై రావడం వల్ల తాత ప్రభావం ఆమెపై పడింది. తల్లి తరఫున బంధువులను కలిసేందుకు పలుమార్లు కమలా హారిస్.. భారత్కు వచ్చారు. అటు జమైకా, ఇటు భారత్ సంస్కృతుల కలబోతగా ఆమె నిలిచారు. అందుకే రాజకీయంగా కమలను బరాక్ ఒబామాతోనూ పోలుస్తారు.
డెమొక్రాట్ల ప్రచారంలో కమలా హారిస్ కీలకపాత్ర పోషించారు. ఫర్ ద పీపుల్ అంటూ కమలా హారిస్ ఇచ్చిన నినాదం.. చాలా పాపులర్ అయింది. మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్ను, ఇమ్మిగ్రేషన్ పాలసీ, హెల్త్కేర్ సిస్టమ్, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడం తదితర అంశాలను ఆమె ప్రచారాస్త్రాలుగా చేసుకున్నారు. మన కోసం, మన పిల్లల కోసం, మన దేశం కోసం' అంటూ కమల విడుదల చేసిన క్యాంపెయిన్ వీడియోకు అనూహ్య స్పందన వచ్చింది. చక్కని వాగ్ధాటి, సమస్యలపై పూర్తి అవగాహన, అటార్నీ జనరల్ గా, సెనేటర్ గా పనిచేసిన అనుభవం.. కమలా హారిస్ ప్లస్ పాయింట్స్ అయ్యాయి.
ఉపాధ్యక్ష అభ్యర్థి కోసం జో బైడెన్ వెతికి వెతికి... చివరకు కమలా హారిస్ పర్ఫెక్ట్ అని భావించారు. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కి షాకిచ్చే రేంజ్లో కమలా హారిస్ స్పీచ్లు ఇవ్వగలరనీ, ప్రజలను ఆకట్టుకోగలరని జో లెక్కలేశారు. కమలా హారిస్కి... అమెరికాలోని అత్యుత్తమ నేతల్లో ఒకరిగా పేరుంది. డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్గా ప్రశంసలు అందుకున్నారు. టెక్నాలజీపై పట్టు.. సోషల్ మీడియాలో ప్రచారం చేసిన అనుభవం కారణంగా... స్పీచ్లు ఇవ్వడంలో దిట్ట అయిన కమలా హారిస్నే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకున్నారు.