కానీ పులివెందులలో వైఎస్సార్ కుటుంబానికి బలం ఉంది. పటిష్టమైన క్యాడర్ ఉంది దానికి కారణం ఆ కుటుంబం అంతా ఒక్కటిగా ఉండడం. అయితే ఇపుడు అదే ఫ్యామిలీలో విభేదాలు పొడసూపుతున్నాయి. రెండేళ్ళ క్రితం మార్చి నెలలో వివేకానందరెడ్డి దారుణ హత్య తరువాత ఆయన కుటుంబం కాస్తా దూరం అయిందని ప్రచారం సాగుతోంది. అజాతశత్రువుగా ఉన్న వివేకా మరణం అందరికీ కలచివేసింది. ఇప్పటికీ నిందితులను పట్టుకోలేకపోయారు. ఎవరు దీని వెనక ఉన్నారు అన్నది కూడా తేలలేదు. హత్య జరిగినపుడు చంద్రబాబు సీఎం గా ఉన్నారు. ఆ తరువాత జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఈ కేసు మాత్రం అలాగే ఉంది.
తన తండ్రి కేసులో అసలు నిందితులు ఎవరో తేలాలని వివేకా కుమార్తె సునీత గట్టి పట్టుదలగా ఉన్నారు. దీని మీద ఆమె హై కోర్టులో వేసిన కేసు మేరకు సీబీఐ కి ఈ కేసును అప్పగించారు. అయినా కూడా నిజానిజాలు బయటకు రాకపోవడంతో రాజకీయంగానే తేల్చుకోవాలని వివేకా కుటుంబం ఆలోచిస్తోంది అంటున్నారు. వివేకా ఫ్యామిలీ బీజేపీ తీర్ధం తీసుకుంటారు అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. నిజానికి పులివెందులలో వివేకా కుటుంబానికి మంచి పట్టు కూడా ఉంది. మరి అదే కనుక జరిగే వైఎస్ ఫ్యామిలీలో బీటలు వారిన ఐక్యతతో ఈసారి జగన్ గెలుపు మీద కూడా ప్రభావం చూపుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి.