దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు హాట్ టాపిక్.తొలిరోజు ఏకంగా 1.91 లక్షల మంది కరోనా టీకాను వేయించుకున్నారు. తొలి విడతలో భాగంగా ఆరోగ్య సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ను అందించనున్నట్లు ప్రధాని మోదీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. వ్యాక్సిన్ వేసుకునే విషయంలో రాజకీయాల నాయకులు తొందరపడొద్దు అంటూ పేర్కొన్నారు. కొన్ని నిబంధనల ఆధారంగానే టీకా పంపిణీ ఉండనున్నట్లు స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే మరి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, ఇతర నేతలు వ్యాక్సిన్ను ఎప్పుడు తీసుకుంటారు అనే ప్రశ్న తలెత్తుతోంది.
అయితే, మొదటి వ్యాక్సిన్ ప్రధాని మోదీయే వేసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు చేసిన డిమాండ్ ను మోదీ పట్టించుకోలేదు. మొదట వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకేనంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్ ను వేస్తున్నారు. మొదటి దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయి, రెండో దశ ప్రక్రియ ప్రారంభం కాగానే ప్రధాని మోదీ వ్యాక్సిన్ వేయించుకోనున్నారని తెలిసింది.
రెండో దశలో ప్రధాని నరేంద్రమోదీ తోపాటు.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ టీకా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ...50 ఏళ్లు పైబడి ఉన్న రాజకీయ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది .అయితే, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లు గుర్తిస్తూ వారికీ మొదటి దశలోనే వ్యాక్సిన్లు ఇవ్వాలని హర్యానా, బీహార్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీకి సూచించారు. అందుకు మోదీ ఒప్పుకోలేదని తెలిసింది. రాజకీయ నాయకులు ఎవ్వరూ మొదటి దశలో వ్యాక్సిన్లు వేయించుకోవద్దని మోదీ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సీరం సంస్థ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్కు అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.ఇదే తరహాలు భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్లో జరుగుతుండటం విశేషం.