ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... తమ సమస్యలు పరిష్కారించాలనే డిమాండ్తో ధర్నా చేయాలని ఉపాధ్యాయులు నిర్ణయించుకున్నారు. అయితే వారి నిరసనకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా అక్కడకు చేరుకున్న తేజస్వీ యాదవ్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పోలీస్ ఉన్నతాధికారులకు, పాట్నా కలెక్టర్కు ధర్నా అనుమతి కోసం ఫోన్ చేశారు. ధర్నా చౌక్ నుంచే జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్కు ఫోన్ చేసి, లౌడ్ స్పీకర్ ఆన్చేసి మరీ బహిరంగంగా మాట్లాడారు. తేజస్వీ మాట్లాడుతూ.. ‘ధర్నా చేయడానికి ఉపాధ్యాయులకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? ప్రతిరోజూ అనుమతి అడగాలా? వారిపై లాఠీఛార్జ్ చేశారు. వారు తెచ్చుకున్న ఆహారాన్ని లాక్కుని విసిరి పారేశారు.. ఇవన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన వ్యక్తం చేయాలని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. అనుమతి కోసం వాట్సాప్ ద్వారా మీకు ఓ లెటర్ పంపుతాను. దయచేసి నిరసన వ్యక్తం చేయడానికి ఉపాధ్యాయులను అనుమతించండి.’ అంటూ తేజస్వీ ఫోన్లో కోరారు.
దీనికి ఆ అధికారి స్పందిస్తూ... ‘తప్పకుండా పరిశీలిస్తా..’ అని సమాధానం ఇచ్చారు.. దీంతో వెంటనే అనుమతి ఎప్పుడిస్తారని తేజస్వీ ఆ అధికారిని ప్రశ్నించారు. అయితే దీనికి ఆ అధికారి సమాధానమిస్తూ... ‘‘ఎప్పటి వరకూ అంటే అర్థం? నన్నే ప్రశ్నిస్తారా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఈ మాటలకు తేజస్వీ తిరుగు సమాధానంగా ‘‘నేను తేజస్వీ యాదవ్ను మాట్లాడుతున్నా.’’ అనేసరికి అవతలి అధికారి... సార్.... సార్... సార్... అంటూ ఒక్కసారిగా స్వరం మార్చాడు. అప్పుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ... ‘‘నేను మీకు వాట్సాప్ ద్వారా అప్లికేషన్ పంపుతాను. తొందరగా స్పందించండి. లేదంటే రాత్రి వరకూ ఇక్కడే ధర్నాలో కూర్చుంటాం.’’ అని చెప్పి కాల్ కట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోను దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మాజీ వ్యక్తిగత సహాయకుడు, హక్కుల కార్యకర్త అయిన సుధీంద్ర కులకర్ణి ట్విట్టర్లో షేర్ చేసి.. ఈ వీడియో తప్పనిసరిగా చూడండి.. దీనిని చివర వరకూ చూస్తే దేశంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న మాస్ నాయకుల్లో ఒకరిగా తేజస్వీ యాదవ్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నారో అర్ధమవుతుంది’ అని కామెంట్ రాశారు. ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.