భారీగా పెరిగిన డీజిల్ ధరలు, కరోనా వల్ల విధించిన లాక్ డౌన్, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాల వల్ల ఆర్టీసీకి నష్టాలు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదించారు. ఆర్టీసీ స్థితిగతులపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలు చర్చించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ఆర్థిక భారం మరింత పెరుగుతుందని వివరించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందించడం, బస్సు చార్జీలు పెంచడం లాంటి చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గే అవకాశం లేదని వారు విన్నవించారు. ‘‘క్రితం సారి బస్సు చార్జీలు పెంచినప్పుడు లీటర్ డీజిల్ ధర 67 రూపాయలు ఉండేది. కానీ చాలా స్వల్ప వ్యవధిలోనే ధర లీటర్ కు 15 రూపాయలు పెరిగింది. ఇది ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపి.. ఆర్థిక భారం మోపింది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలోనూ ఆర్టీసీ నష్టాలను చవిచూసింది. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిల భారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచాల్సి ఉంది. ఒకవేళ జీతాలు పెంచితే ఆర్టీసీపై పెనుభారం తప్పదు. అది భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలి. బస్సు చార్జీలు పెంచాలి. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి ఉండద’’ని అధికారులు సీఎంకు వివరించారు.
                               ‘‘వాస్తవానికి గతంతో పోలిస్తే ఆర్టీసీ పరిస్థితి ఎంతో మెరుగైంది. ప్రభుత్వం అందించిన ఇతోధిక సహాయం, ఆర్టీసీలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సులు తిప్పడం వల్ల మంచి ఫలితం వచ్చింది. ఆక్యుపెన్సీ శాతం 58 శాతానికి చేరుకుంది. క్రమంగా ఇది పెరుగుతున్నది. దీనివల్ల రోజుకు 9 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. అయితే డీజిల్ రేట్లు పెరుగుతుండడం నష్టదాయకంగా మారుతున్నది. లాక్ డౌన్ మిగిల్చిన నష్టాలు, పాత అప్పులు ఇంకా గుదిబండగానే ఉన్నాయ’’ని సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ అధికారులు వివరించారు. కార్గో సేవల ద్వారా ఇప్పటికి 17.72 లక్షల పార్శిళ్లను గమ్యానికి చేరవేశారని, దీనివల్ల ఆర్టీసికి 22.61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సీఎంకు చెప్పారు. ప్రజలు కూడా ఆర్టీసీ కార్గో సేవలతో సంతృప్తి చెందుతున్నారని కార్గో సేవల స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్ ను కేసీఆర్ ప్రశంసించారు. అయితే ఆర్టీసీలో కార్గో సర్వీసులు విజయవంతం అయ్యాయని,  ప్రజలకు గొప్ప సేవలు అందుతున్నాయని ఆర్టీసీ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.ఈ సమీక్షా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, సంస్థ ఎండీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఫైనాన్స్ అడ్వయిజర్ రమేశ్, ఇడీ యాదగిరి, స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్, తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: