గత కొన్ని సంవత్సరాలుగా సోనియా గాంధీ, లేకపోతే రాహుల్ గాంధీ ఇలా ఒకరు కాకపోతే ఒకరు అధ్యక్షా పదవి చేపట్టి పార్టీ సభ్యులను అయోమయంలో పడేశారు. వయసైపోయి అనారోగ్యంతో సోనియా గాంధీ సగం సగం పనులతో పార్టీ కార్యాచరణ ను సరిగ్గా అమలు చేయలేకపోయింది.. రాహుల్ గాంధీ కూడా అవగాహనా లోపం, సీనియర్ ల మాట వినకపోవడం వంటి చర్యలతో సొంత పార్టీ నేతల వ్యతిరేకత ను మూటగట్టుకుని పార్టీ ని సరైన గాడిలో పెట్టలేకపోయాడు. దాంతో గాంధీ కుటుంబంలో కాకుండా ఇతర వ్యక్తులకు పార్టీ బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్ ఇప్పుడు నెలకొంది. ఓ రకంగా ఈ చర్చ పార్టీ ఉనికికే ప్రమాదంగా మారింది.
ఈ క్రమంలో అధ్యక్ష పదవికి ఎంపిక ఎప్పుడు కొలిక్కి వస్తుందో అని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ సమావేశాలు పూర్తికాగానే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ అధ్యక్షుడుగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ ఈ ఎన్నికల్లో అధ్యక్షుడుగా పోటీ చేస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ లో ఏఐిసీసీ ప్లీనరీ జరుగుతుందని, ఈసమావేశంలో రాహుల్ కొత్త టీమ్ను కూడా ఎంపికచేస్తారని ఆ వర్గాలు తెలిపాయి.