భారత స్వతంత్ర సంగ్రామ చరిత్ర లో నేతాజీ సుభాష్ చంద్ర బొస్ ది ఒక సువర్నాధ్యాయం. ఆయన స్వతంత్ర పొరాటం సమయంలో పాటించిన విలువలు, ఆయన జ్ఞానసంపద, యువతను దేశ ప్రజలను  ఉత్తేజ పరచిన తీరు ముదావహం. ఆయన ఉపన్యాసాలను చదువుతూ వింటూ ఇప్పటికీ జాతిజనం ఉత్తేజితులౌతారు. ఎన్నిసార్లు విన్నా, చదివినా తనివి తీరదు. 

 

ఐతే, ఆయన జన్మదినమైన ఈ రోజున  జీవితాంతం రహస్యంగా ఉంచిన ఆయన ప్రేమ కథను స్పృసిద్ధాం. 

 

అది 1934. శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొంటూ జైలు పాలైన సుభాష్ చంద్ర బోస్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండటంతో, భయంతో బ్రిటిష్ ప్రభుత్వం చికిత్స నిమిత్తం ఆయనను యూరప్‌ లోని ఆస్ట్రియాకు పంపింది. ఆదేశ రాజధాని వియన్నాలో చికిత్స పొందుతూనే యూరప్‌ లో ఉన్న భారతీయ విద్యార్థులందరిని ఏకం చేసి, వారు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా చేయాలని బోస్ సంకల్పించారు. దాంతో భారత స్వతంత్ర  సంగ్రామానికి కొత్త ఊపు, రూపు ఇవ్వాలనేది ఆయన ఆలోచన. విదెశాల్లో అదీ యూరప్ నుండి ఇండియాలోని బ్రిటీష్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలనేది ఆయన ఆశయం.

 

నేడు సుభాస్ చంద్ర బోసు జయంతి (23 జనవరి, 1897 న ఆయన జన్మించారు) సందర్భంగా, కాసేపు స్వాతంత్ర సంగ్రామం వదిలేసి, వినూత్నంగా నాడు యువరక్తం పరుగులెత్తే ఆ యువ నాయకునికి ప్రెమకథ లుండవా? అంటే ఆయన జీవితంలో అపూర్వమైన ప్రెమకథ ఒకటుంది. కాసేపు అటు వైపు దృష్టి  సారిద్ధాం. 


ఎందుకంటే  "ఎంతటి మహరాజైనా ఎపుడో ఏకాంతములో ఎంతొ కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలో విచిత్రం" అని సినారె 'దాన వీర శూర కర్ణ' సినిమాలో సుయోధన, భానుమతి ల కోసం రాసిన పాట “సుభాష్ - ఎమిలి ల ప్రేమ కథ” ను సేకరించేలా చేసింది. 

 

సుభాస్ ఆస్ట్రియాలో ఉన్నప్పుడు ఒక యూరోపియన్ పబ్లిషర్  'ఇండియన్ స్ట్రగుల్' అన్న పుస్తకం రాయాలని ఆయనను కోరారు. దాంతో బోస్‌కు ఇంగ్లీష్ తెలిసిన, టైపింగ్ వచ్చిన ఒక అసిస్టెంట్ అవసరం ఏర్పడింది. బోస్ స్నేహితుడైన డాక్టర్ మాథూర్, ఆయనకు రెండు పేర్లను సూచించారు. వారిలో ఒకరు ‘ఎమిలీ షెంకెల్’ అనే అందమైన ఆస్ట్రియా యువతిని బోస్ తన సహాయకురాలిగా నియమించుకున్నారు. 

 

ఎమిలీ 1934 జూన్ నుంచి బోస్‌ తో కలిసి పని చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో బోస్ ‌కు 34 ఏళ్లు. ఎమిలీకి 23 ఏళ్లు. ఆమెను కలవడానికి ముందు ఆయన ఆలోచనలన్నీ దేశ సంగ్రామం మీదే నిమగ్నమై ఉన్నాయి. అయితే ఎమిలీ తన జీవితంలో ఒక తుపాను తెస్తుందని ఆయన ఊహించలేక పోయారు. ఆయన ఎమిలీని కలవడంతో తన జీవితమే మారిపోయిందని రాశారు.


"మొదట ప్రేమ విషయాన్ని నేనె ప్రతిపాదించారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం ప్రారంభించింది, 1934-36 మధ్యకాలం లో ఆస్ట్రియా, చెకొస్లొవేకియాలలో ఉన్న సమయం మా జీవితంలో అత్యంత మధురమైనది" అని ఎమిలీ - సుబాష్ అన్న కుమారుడు సౌగత్ బోస్ ‌కు ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

 

ఎమిలీ జనవరి 26, 1910 లో ఆస్ట్రియాలోని క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రికి ఆమె ఒక  భారతీయుని వద్ద పని చేయడం ఇష్టం లేదు. అయితే సుభాష్ చంద్ర బోస్ ‌ను కలిసిన తర్వాత ఆయన వారి ప్రేమను కాదనలేకపోయారు.

 

ప్రముఖ విద్యావేత్త రుద్రాంశు ముఖర్జీ, బోస్, జవహర్ లాల్ నెహ్రూ జీవితాలను పోలుస్తూ 'నెహ్రూ అండ్ బోస్, పేరలల్ లైవ్స్' అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఆయన బోస్, నెహ్రూలపై వారి భార్యల ప్రభావం గురించి రాసుకొచ్చారు.

 

ఆ పుస్తకంలో ముఖర్జీ, ''సుభాష్, ఎమిలీ లు మొదటి నుంచీ తమ బంధం ప్రత్యేకమైనదని, క్లిష్టమైనదని గుర్తించారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలను బట్టి ఈ విషయం మనకు తెలుస్తుంది. ఎమిలీ "మిస్టర్ బోస్" అని సంబోధిస్తే, బోస్ "మిస్ షెంకెల్"  లేదా "పెర్ల్ షెంకెల్" అని సంబోధించేవారు.'' అని రాశారు.

 

తన ఉనికి బయటపడకుండా ఉండడానికి, సైనిక పోరాటంలో యూరోపియన్ దేశాల సహాయాన్ని తీసుకోవడానికి బోస్ నిరంతరం ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లాల్సి వచ్చేది. అయితే ఎమిలీ పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉండేదో ఆయన ఆమెకు రాసిన ప్రేమలేఖను బట్టి తెలుస్తుంది.

 

1936 మార్చి 5 న రాసిన ఈ లేఖలో, ''మై డార్లింగ్, సమయం వస్తే మంచు కూడా కరుగుతుంది. ప్రస్తుతం నా హృదయం పరిస్థితి కూడా ఇదే. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, రాయకుండా, చెప్పకుండా నన్ను నేను నిలువరించుకోలేక పోతున్నాను. మై డార్లింగ్, నువ్వు నా హృదయ సామ్రాజ్ఞివి. కానీ నువ్వు నన్ను నేను నిన్ను ప్రేమించే అంతగా ప్రేమిస్తున్నావా?'' అని అంటారు.

 

''భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలీదు. బహుశా నేను జీవితాంతం జైలులో గడపాల్సి రావచ్చు. నన్ను కాల్చి చంపొచ్చు, ఉరి తీయొచ్చు. నేను మళ్లీ నిన్ను చూడలేక పోవచ్చు. బహుశా నేను ఉత్తరాలు కూడా రాయలేక పోవచ్చు. కానీ నన్ను నమ్ము, నువ్వెప్పుడూ నా హృదయంలోనే ఉంటావు. మనం ఈ జీవితంలో కలిసి ఉండలేక పోతే, వచ్చే జన్మలోనైనా కలిసి ఉందాం.'' అని ఎమిలీకి రాశారు.

 

బోస్ స్నేహితులు, రాజకీయ సహచరులు ఏసీఎన్ నంబియార్, ''బోస్ ఆలోచనలు ఎప్పుడూ దేశ స్వాతంత్ర సంగ్రామం మీదే కేంద్రీకృతమై ఉండేవి. ఆయన మనస్సు ఎక్కడైనా చెదిరింది అంటే అది ఎమిలీతో ప్రేమలో పడినప్పుడే'' అని సౌగత్ బోస్ ‌కు తెలిపారు.

 

ఆ సమయంలో బోస్ మానసిక స్థితి ఎలా ఉందో 1937 ఏప్రిల్ - మేలో ఎమిలీకి రాసిన లేఖ ద్వారా తెలుస్తుంది.

 

''గత కొన్ని రోజుల నుంచి నీకు ఉత్తరం రాయాలనుకుంటున్నా. కానీ నీకు తెలుసు, నీ గురించి నా భావాలను మాటల్లో పెట్టడం ఎంత కష్టమో! నేను నీ పట్ల గతంలో ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నానని మాత్రమే చెప్పదల్చుకున్నా.''

 

''నీ గురించి తలచుకోకుండా ఒక్క దినం కూడా గడవదు నాకు. నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు. నువ్వు కాకుండా నేను ఇతరుల గురించి ఆలోచించను కూడా ఆలోచించ లేను. ఈ రోజుల్లో నేనెంత ఒంటరిగా, దిగులుగా ఉన్నానో నీకు చెప్పలేను. కేవలం ఒకే ఒక్క విషయం నన్ను సంతోషంగా ఉంచు తోంది. అయితే అది సాధ్యమో! లేదో నాకు తెలీదు. రాత్రీ పగలూ నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. నాకు సరైన దారి చూపించాలని ప్రార్థిస్తున్నాను.'' అని రాశారు.

 

సుభాష్ బోస్ సోదరుడు శరత్ చంద్ర బోస్ కుమారుడు శిశిర్ కుమార్ బోస్ భార్య కృష్ణ బోస్ ఎ ట్రూ లవ్ స్టోరీ - ఎమిలీ అండ్ సుభాష్ పుస్తకాన్ని రాశారు. అందులో ఆమె సుభాష్ చంద్ర బోస్, ఎమిలీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

 

ఎమిలీ,- బోస్ ‌ల వివాహం డిసెంబర్ 27, 1937 న ఆస్ట్రియాలోని బాడ్‌గస్టైన్ ‌లో జరిగింది. అయితే తమ వివాహాన్ని రహస్యంగా ఉంచాలని వారు నిర్ణయించు కున్నారు. తమ పెళ్లి రోజు గురించి తప్ప ఏ వివరాలూ ఎమిలీ వెల్లడించ లేదని కృష్ణ బోస్ తెలిపారు. అయితే వారి కూతురు అనితా బోస్ మాత్రం తన తల్లి ఎమిలీ ఇతర భారతీయ పెళ్లికూతురి తరహా లోనే తలపై సింధూరం ధరించారని వివరించారు.

 

వారిద్దరి మధ్యా ఎంతో ప్రేమ ఉన్నా మేధోపరంగా వారిద్దరి మధ్యా ఎంతో అంతరం ఉండేది. కొన్నిసార్లు అది బయట పడేది. కృష్ణ బోస్ తన పుస్తకంలో, 'ఎమిలీ భారతదేశంలోని పత్రికల కోసం వియన్నా నుంచి ఏదైనా రిపోర్టులు రాయాలని బోస్ సూచించారు. బోస్ సూచన మేరకు ఎమిలీ ద హిందూ, మాడర్న్ రివ్యూలకు కొన్ని వ్యాసాలు రాశారు. అయితే వార్తలను విశ్లేషించడంలో ఆమె అంత దిట్ట కారు. దీంతో బోస్ అనేకమార్లు వాటిని విమర్శించేవారు.' అని తెలిపారు.

 

1937, ఆగస్టు 12 న ఎమిలీకి రాసిన లేఖలో బోస్, 'నువ్వు భారత్ గురించి ఏవైనా కొన్ని పుస్తకాలు పంపమని రాశావు. కానీ వాటిని నీకు పంపినా లాభం లేదని అనిపిస్తోంది. ఎందుకంటే నీ వద్ద ఉన్న పుస్తకాలనే ఇప్పటి వరకు నువ్వు చదవలేదు' అని రాశారు.

 

'నువ్వు సీరియస్‌గా లేనంత వరకు పుస్తకాలు చదవడంలో నీకు ఆసక్తి పెరగదు. వియన్నాలో నువ్వు చాలా పుస్తకాలే సేకరించావు. కానీ వాటిన్నటినీ చదవలేదని నాకు తెలుసు' అని బోస్ అనే వారు.


ఇవన్నీ ఎలా ఉన్నా, వాళ్లిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకునే వారు. వాళ్ల ప్రేమకు గుర్తుగా నవంబర్ 29, 1942న బోస్, ఎమిలీలకు కూతురు పుట్టింది. వారు ఆమెకు ఇటలీ విప్లవ నేత గారిబాల్డీ భార్య, బ్రెజిల్ మూలాలు కలిగిన అమిత గారిబాల్డీ పేరిట అమిత అని పెట్టారు. జర్మన్ ఉచ్చరణలో అది అనిత గా మారిపోయింది. 

 

చివరి వరకు రహస్యం గానే వివాహాన్ని ఉంచడం వెనుక అది తన 'పొలిటికల్ కెరీర్'‌ పై ప్రభావం చూపించే అవకాశం ఉందని బోస్ భావించి ఉండవచ్చు. అంతే కాకుండా ఒక విదేశీ వనితను పెళ్లాడారన్న ఇమేజ్ ఆయనపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

 

శరత్ చంద్ర బోస్ కార్యదర్శి, ప్రముఖ రచయిత నిరాద్ సి.చౌదరి 198 9లో రాసిన 'దై హ్యాండ్, గ్రేట్ అనార్క్: ఇండియా 1921-1952' అన్న పుస్తకంలో ‘'బోస్ వివాహం గురించి తెలిసినపుడు నాకు షాక్ తగిలింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆయన తన సెక్రటరీ అయిన ఒక జర్మన్ మహిళను పెళ్లాడినట్లు నాకు తెలిసింది'' అని పేర్కొన్నారు.

 

సుభాష్ చంద్రబోస్ 1942 డిసెంబర్‌లో తన కూతురిని చూసేందుకు వియన్నా వెళ్లారు. ఆ తర్వాత ఆయన సోదరుడు శరత్ చంద్ర బోస్‌కు బెంగాలీలో రాసిన లేఖలో తన భార్య, కూతురి గురించి పేర్కొన్నారు. అక్కడి నుంచి ఒక మిషన్ మీద వెళ్లిన ఆయన తర్వాత మరెన్నడూ “ఎమిలీ, అనిత” లను కలుసుకోలేదు.

 

కానీ ఎమిలీ సుభాష్ చంద్ర బోస్ జ్ఞాపకాల తోనే జీవించి 1996 లో కన్ను మూశారు. ఓ చిన్న పోస్టాఫీసు లో పని చేస్తూ ఆమె సుభాష్ చంద్ర బోస్ గుర్తుగా మిగిలిన అనితా బోస్‌ ను పెంచి పెద్ద చేసి, జర్మనీలో పెద్ద ఆర్థికవేత్తగా తీర్చిదిద్దారు.

 

ఎన్ని కష్టాలు ఎదురైనా ఆమె సుభాష్ చంద్ర బోస్ కుటుంబం నుంచి ఏలాంటి సహాయాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. అంతే కాదు, తమ వైవాహిక జీవితం గురించి బోస్ ఎంత రహస్యంగా ఉంచారో, దానిని ఆమె చివరి వరకు కాపాడారు.దటీస్ ది రియల్ లవ్.

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: