న్యూఢిల్లీ: గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చిత్తుగా ఓడించిన యూఎస్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. వైట్ హౌస్ లో తన మార్కు చూపించడం ప్రారంభించారు. అదే సమయంలో ఓవల్‌ ఆఫీసులో కూడా కొన్ని మార్పులు చేశారు. ట్రంప్ హయాంలో అమెరికా అధ్యక్షుడి టేబుల్‌పై తన‌కు ప్రీతి పాత్రమైన ఓ బటన్ ఇప్పుడు కనిపించడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఈ ట్రంప్ బటన్‌ ను‌ తొలగించేశారు. గతంలో ఆ టేబుల్‌పై చెక్క బాక్సుతో కూడిన ఓ ఎర్ర కలర్‌ బటన్ ఉండేది. డైట్‌ కోక్‌ అంటే ట్రంప్‌కు పిచ్చ ఇష్టం. అందుకే తనకు కోక్ తాగాలని అనిపించిన ప్రతిసారీ ఆ బటన్‌ నొక్కేవారు. నొక్కిన ప్రతిసారీ ఓ వెండి పళ్లెంలో డైట్‌ కోక్ ‌ను పెట్టుకొని ఓ నౌకరు ఆ గదిలోకి వచ్చేవాడు. అది తీసుకొని ట్రంప్‌ గటగటా తాగేసేవారు. అయితే ఈ బటన్‌, ట్రంప్‌ అధ్యక్షుడు కాక ముందు నుంచే ఆ టేబుల్‌ మీద ఉండేది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఈ మీటను వాడుకునే వారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ టేబుల్‌పై ఈ బటన్ మాయమైంది. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిరోజు ఆయన టేబుల్‌పై రెండు ఫోన్లు, ఓ కాఫీ కప్పు, ఓ పెన్నుల సెట్టు మాత్రమే కనిపించాయి.

అధ్యక్ష పదవిని చేపట్టినవారిలో చాలామంది తమ అభిరుచులకు అనుగుణంగా కార్యాలయాన్ని మార్పుకోవడం సహజం. బైడన్‌ రావడంతో ఇప్పుడూ ఓవల్‌ ఆఫీసు కొత్తగా కనిపిస్తోంది. ఆఫీసులో అప్పటిదాకా ఉన్న మాజీ అధ్యక్షులు ఆండ్రూ జాక్సన్‌, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్డ్‌ చిత్తరువులను బైడన్‌ తొలగించారు. మాజీ అధ్యక్షుడు థామస్‌ జెఫర్‌సన్‌, ప్రగతిశీల వాదులైన రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నెడీ, మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌, రోసా పార్క్స్‌ ఎలనోర్‌ రూజ్‌వెల్డ్‌, పౌరహక్కుల కార్యకర్త సీజర్‌ చావేజ్‌ చిత్తరువులను ఉంచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: