ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు గ్రామ వాలంటీర్లను దూరంగా ఉంచాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎస్‌ఈసీకి లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికలను కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలన్నారు. అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ జెండా రంగుల అంశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆయన కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ టీవీ సర్వైలెన్స్ ఏర్పాటు చేయాలని వర్ల రామయ్య కోరారు.
                                                           2020 మార్చిలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అప్రజాస్వామిక, హింసాత్మక విధానాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు వర్ల రామయ్య గుర్తుచేశారు. రాష్ట్రంలోని ఒక వర్గం పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. మార్చిలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల అధికారులు సహకరించలేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై అధికార పార్టీ గూండాలు హింసాత్మక దాడులకు పాల్పడ్డారన్నారు. ఎన్నికల అధికారులు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు ఒక ఓటర్ లిస్టు, అధికార పార్టీ అభ్యర్థులకు మరో ఓటర్ లిస్టులు ఇచ్చి అనేక అవకతవకలకు పాల్పడ్డారని వర్ల రామయ్య ఆరోపించారు.
                                గత ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్లు అడ్డగించారని.. ఈసారి ఎన్నికల్లో నామినేషన్లను ఆన్లైన్‌లో సమర్పించేలా ఏర్పాటు చేయాలని ఎస్ఈసీని వర్ల రామయ్య కోరారు. ఎన్నికల్లో పాల్గొనే ప్రజలను, విధి నిర్వహణలో ఉన్న అధికారులను కరోనా బారి నుండి కాపాడేందుకు కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని ఆయన కోరారు. ఎన్నికల అధికారులకు, విధులు నిర్వహించే సిబ్బందికి వారు పనిచేస్తున్న రెవెన్యూ డివిజన్ లో విధులు నియమించకుండా ఇతర డివిజన్లలో డ్యూటీలు వేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ను వర్ల రామయ్య కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: