తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు చేదు అనుభవం ఎదురయింది. కమ్మర్ పల్లి మండలం చౌటుపల్లి గ్రామంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో రైతుల చర్చలు రసాభాసగా జరిగాయి. గత పార్లమెంటు ఎన్నికల వేళ బాండ్‌ పేపర్‌పై రాసి ఇచ్చిన ప్రకారం.. పసుపు బోర్డు తేలేనందున ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తక్షణమే రాజీనామా చేయాలని పసుపు రైతులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. పసుపు మద్దతు ధర రూ.15 వేలు, పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో ఆలస్యం వంటి వాటిపై ఎంపీని రైతులు సూటిగా ప్రశ్నించారు. అర్వింద్ పసుపు బోర్డుపై గతంలో మాట్లాడిన వీడియోలను అతనికి నేరుగా ఫోన్‌లో చూపించి మరీ రైతులు అంతా ఆయన్ను నిలదీయటం విశేషం.



ఇక గతంలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి అరవింద్ గెలిస్తే... తాను గెలిచిన 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చేసిన వాగ్దానం విషయమై ఇప్పుడు ఎందుకు హామీలు నెరవేర్చలేదనీ రైతులు నిలదీశారు. కనీసం రూ.15 వేల మద్దతు ధర ఎందుకు ప్రకటించడం లేదని సూటిగా ప్రశ్నించారు. అయితే, బాండ్ పేపర్‌లో నిర్ణీత సమయం, మద్దతు ధర చెప్పలేదని ఎంపీ ఈ విషయాన్ని దాటవేశారు. రాసిచ్చిన బాండ్ పేపర్‌కు సమాధానం చెప్తావా లేక రాజీనామా చేసి మాతో పాటు ఉద్యమంలోకి వస్తావా అని రైతులు ఎంపీని నిలదీశారు. ఇదే సమయంలో హామీల వీడియోలను కూడా చూపించారు. చౌటుపల్లిలో జరిగిన ఈ సమావేశంలో రైతుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ధర్మపురి అర్వింద్ అక్కడి నుంచి అర్దాంతరంగా వెళ్లిపోయారు. ఈ సమయంలో ఎంపీ డౌన్ డౌన్ అంటూ పసుపు రైతులు భారీగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఎంపీకి బుద్ది చెపుతామని రైతులు హెచ్చరించారు. అలాగే అయన ఇంటిని ముట్టడిస్తామని, నియోజకవర్గంలో అడుగు పెట్టనీయబోమని హెచ్చరించారు. రీజినల్‌ కార్యాలయం పసుపు బోర్డుకంటే ఉపయోగకరమైనదని చెప్తున్న అర్వింద్‌ అదే మాటతో రాజీనామా చేసి మళ్లీ ప్రజల ముందుకెళ్ళి ఓట్లడిగి గెలవాలని రైతులు సవాలు విసరటం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: