ఇక నేటి సమాజంలో సెల్ ఫోన్లు మనిషి జీవితంలో భాగంగా మారిపోయాయి. మొబైల్ ఫోన్ వ్యసనంగా మారడమే కాదు నిండు ప్రాణాలను బలి తీసుకునేంతలా బానిసలైపోతున్నారు. తాజాగా హైదరాబాద్ మహా నగరంలో ఓ బాలిక సెల్ ఫోన్ కోసం ఫ్రెండ్ తో గొడవపడి బలవన్మరణానికి పాల్పడింది. సెల్ ఫోన్ విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్ ప్రాంతంలోని న్యూ కాలనీలో నివసముంటున్న సంగీత పెద్ద కూతురు అనిత మధ్యాహ్నం ఇంటి పక్కన ఉండే తన ఫ్రెండ్ తో సెల్ ఫోన్ విషయంలో గొడవ పడింది. ఈ విషయం తల్లికి తెలిస్తే మందలిస్తుందన్న భయంతో.. ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబసభ్యలు బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు విడిచిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.