తెలంగాణ సీఎం కేసీఆర్ క్రమంగా పార్టీపై, పార్టీ నేతలపై పట్టు కోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన కుమారుడికి పట్టం కట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న సమాచారం బయటకు వచ్చిన తర్వాత పార్టీ నేతలు, కేటీఆర్ కు మద్దతుగా ప్రకటనలు చేసేవారితో పాటు, తమదైన భిన్నమైన రాజకీయం చేసే నేతలు కూడా, ఎక్కువైపోయారు.
వివాదాస్పద ప్రకటనలు చేస్తూ, పార్టీకి కొత్త కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నారు. నిన్నామొన్నటి వరకూ, మీడియా ముందు ఏం మాట్లాడాల న్నా, ప్రగతి భవన్ నుంచి సూచనలు అందేవి. వాటికి మించి ఒక్కటి కూడా ఎక్కువ మాట్లాడటానికి లేదు. కానీ ఇప్పుడు, అలాంటి సూచనలు అందకపోయినా నేతలు మాట్లాడేస్తున్నారు. గతంలో ఉన్నంత భయం ఇప్పుడు లేదు. ఏం మాట్లాడితే ఏం అవుతుందో అన్న ఉద్దేశంతో చాలా మంది నేతల్ని టీవీ చర్చలకు వెళ్లకుండా టీఆర్ఎస్ కట్టడి చేసింది.
కేటీఆర్ కు అనుకూలంగా ప్రకటనలు చేయడానికి మాత్రం ప్రస్తుతానకి టీఆర్ఎస్ హైకమాండ్ స్వేచ్ఛ ఇచ్చింది. దీన్ని ఆ పార్టీ నేతలు మరింతగా చొరవ తీసుకుంటున్నారు. విపక్షనేతల్ని విమర్శిస్తున్నామని అనుకుంటున్నారో, తమ పార్టీ నేతల్ని బ్లాక్మెయిల్ చేద్దామను కుంటున్నారో కానీ, ప్రకటనలు ప్రారంభించారు.
1 అయోధ్య రాముడి గుడి విరాళాలపై ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన ప్రకటన అలజడికి కారణం అయింది. వెంటనే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి, విరాళం ఇప్పించి, మరీ వివాదాస్పదం కాకుండా చేయగలిగారు.
2 అయోధ్య రామ మందిర విరాళాల విషయంలో చెలరేగిన వివాదం పూర్తిగా తగ్గక ముందే మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరో బాంబు పేల్చారు. ఆయన నేరుగా పార్టీ తీరుపై సూటిగా సెటైర్లు వేశారు. తానొక లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. స్వేచ్చగా పాడలేక పోతున్నానని, మాట్లాడలేక పోతున్నాని స్వేచ్ఛ లేకుండా పోయిందని తాను ఇలాంటి జీవితాన్ని కోరుకోలేదని నిర్వేదంతో మాట్లాడారు.
కవులు, కళాకారుల మౌనం కేన్సర్ కంటే ప్రమాదకరమన్నారు. రసమయిని కేబినెట్ లోకి తీసుకుంటామని స్వయంగా కేసీఆరే బహిరంగంగా ప్రకటించారు. కానీ అది ఇప్పటి వరకు జరగలేదు. అందుకే తనను గుర్తించాలని, కేటీఆర్ మంత్రివర్గంలో చోటు కోసం ఇలాంటి రాజకీయం ప్రారంభించారని టీఆర్ఎస్ వర్గాలు గొణుక్కుంటున్నాయి.
3 జగద్గిరిగుట్ట టీఆర్ఎస్ కార్పొరేటర్ కొలుకుల జగన్, అతని అనుచరులు మద్యం మత్తులో ఆదివారం అర్ధరాత్రి మగ్ధూం నగర్లో వీరంగం సృష్టించారు. పాతకక్షలతో బీజేపీ నాయకురాలి ఇంటిపై దాడి చేసి కొట్టారని బాధితురాలు ఆరోపించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. కొలుకుల జగన్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, సీఐ సైదులు, డీఐ మహేష్ జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్కు వచ్చి బాధితులపై చర్యలు తీసుకుంటామని ఆందోళన విరమించాలని కోరినా బీజేపీ నాయకులు ససేమిరా అన్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి పలువురిని అరెస్ట్ చేశారు.
4 జగద్గిరిగుట్టలో వీధి గూండాలుగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడుతున్న టీఆర్ఎస్ కార్పొరేటర్ కొలుకుల జగన్, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని బీజేపీ నాయకులు మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, కొలన్ హన్మంత్ రెడ్డి, ఎం.ఎస్. వాసు డిమాండ్ చేశారు. కార్పొరేటర్ కొలుకుల జగన్ ను అరెస్ట్ చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
5 టీఆర్ఎస్ అధిష్టానం జోక్యం చేసుకొని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వేధింపుల నుంచి తమను రక్షించాలని టీఆర్ఎస్ నేరేడ్మెట్ కార్పొరేటర్ కటికనేని శ్రీదేవి కోరారు. సోమవారం డివిజన్ పరిధి లోని కార్పొరేటర్ కార్యాలయంలో ఆమె, అనుచరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టించి అధికార బలంతో వేధిస్తున్నారని ఆరోపించారు.
మహిళలనడ్డు పెట్టుకొని ఎమ్మెల్యే మైనంపల్లి తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అధికారులు ఎమ్మెల్యే చెప్పినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మల్కాజిగిరి అధికారులకు తాను రాతపూర్వకంగా అక్రమనిర్మాణాలపై 34 ఫిర్యాదు లు చేసినా నేటికీ చర్యలు తీసుకోలేదన్నారు.
యాప్రాల్ లో తన భర్త హనుమంత రావు, నేరేడ్మెట్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇతర వ్యాపార భాగస్వాములతో కలిసి కొనుగోలు చేసిన ఐదు ఎకరాల భూమిని ఎమ్మెల్యేకు ఇవ్వనందుకే తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకొన్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే అక్రమాలను లీగల్ గా ఎదుర్కొంటామని, పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని వాస్తవాలను పరిశీలించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీదేవికోరారు.
కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వనీయకుండా మైనంపల్లి అడ్దుపడుతున్నారని, మంత్రులు చెప్పినా వినకుండా వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రకారం వ్యవహరించడం పార్టీకి నష్టం చేస్తుందని ఆమె అన్నారు. ఎమ్మెల్యే అనుచరులు నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలు, బెదిరింపు లకు పాల్పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే నన్నారు.
తెలంగాణ ఉద్యమసమయం కలిసి పనిచేస్తున్నా అక్రమకేసులు పెట్టి వేధించడం ఎంతవరకు న్యాయమని టీఆర్ఎస్ పార్టీ నేరేడ్మెట్ మాజీ అధ్యక్షడు మధుసూదన్రెడ్డి ప్రశ్నించారు. 200మంది పోలీసులను పంపించి మున్సిపల్ అధికారులతో తనఇంటిని కూల్చివేయడం న్యాయం కాదన్నారు. తాము ఎటువంటి భూకబ్జాలకు పాల్పడలేదన్నారు. కబ్జాలు ఎమ్మెల్యే నిరూపిస్తే వ్యాపారాలు మానుకొంటామని హనుమంతరావు చెప్పారు. త్వరలోనే తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.
అక్రమాలకు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేటర్ శ్రీదేవి హనుమంతరావు, జీకే హనుమంత రావు, డివిజన్ అధ్యక్షుడు మధుసూధన రెడ్డి లను క్రమశిక్షణా చర్యలలో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు.
టీఆర్ఎస్ పేరు ఉపయోగించుకొని, ఉద్యమకారులమని చెబుతూ అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.
సోమవారం మల్కాజిగిరి క్యాంపు కార్యాలయంలో బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కార్పొరేటర్ శ్రీదేవి, జీకే హనుమంత రావు, డివిజన్ అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి భూఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదలను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదన్నారు.
కేసీఆర్ నుంచి కేటీఆర్ కు అధికార మార్పిడి జరిగే వేళ టీఆరెస్ నేతలు సమస్యల హారంతో ఆయన కంఠసీమను అలంకరించనున్నారా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.