తెలంగాణ ఏర్పడిన తొలిరోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఫిట్-మెంట్ ప్రకటించింది. అప్పట్లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యోగులందరూ ఉద్యమించడం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంలో వారి పాత్ర కీలకం కావడంతో కేసీఆర్, నాడు సిఫార్సులకు మించి ఏకంగా 43 శాతం ఫిట్-మెంట్ ప్రకటించారు. ఉద్యోగ సంఘాలన్నీ చాలా సంతోషపడ్డాయి.
తెలంగాణ ప్రకటనతో ఏపిలో ఆర్థిక సమస్యలున్నా, తమ ఉద్యోగుల్ని నిరాశ పరచడం ఇష్టం లేక, అదే ఫిట్మెంట్ ను వారు ప్రకటించారు.
ఇప్పుడు మరోసారి “పీఆర్సీ కమిషన్” తన నివేదిక ఇచ్చింది. ఎప్పుడో తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముందే రావాల్సింది. కానీ వ్యూహాత్మకంగా రెండు సంవత్సరాల పాటు నిరీక్షింపజేసి తీరికగా నివేదిక ఇచ్చారు.
ప్రభుత్వం దాన్ని ఇప్పుడు బహిర్గతం చేసింది. ఆ నివేదికలో ఫిట్-మెంట్ను కేవలం 7.5 శాతానికి మాత్రమే రెకమండ్ చేశారు. అయితే నివేదిక లోని కొన్ని సూచనలు ఉద్యోగులకు కూడా సంతృప్తిని కలిగించేలా ఉన్నాయి.
*ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 నుంచి 60 ఏళ్ళకు పెంచడం *ఉద్యోగుల కనీస వేతనం ₹19000/- గరిష్ట వేతనం ₹162070 వరకు ఉండవచ్చన్న సూచనలు చేసింది.
*గ్రాట్యుటీ పరిమితి ₹16 లక్షలు
*శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంచాలని సూచన చేసింది.
అయితే ఈ సిఫార్సులే అంతిమం అనుకోరాదు. ఉద్యోగ సంఘాలతో సిఫార్సులపై ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని “త్రిసభ్య కమిటీ” ని చర్చించమని కేసీఆర్ ఆదేశించారు. పీఆర్సీ కమిటీనే ఇంత తక్కువ సిఫార్సు చేసినప్పుడు ఉద్యోగులు, 30 శాతం 40 శాతం అడిగే అవకాశం ఉండదు. అంత ఎక్కువ ఫిట్-మెంట్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది.
అయితే మద్యంతర భృతి (ఐఆర్) కూడా ఇవ్వకుండా, ఎకాయకీ పిఆర్సి 7.50 శాతానికి పరిమితం చేశారు. దాంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి కి గురయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మధ్యంతర భృతి 27 శాతం ప్రకటించింది. అంతే కాదు అదే తక్కువలో తక్కువ "వేతన సవరణ" గా మార్చే అవకాశం ఉంటుంది. మరి తెలంగాణ ఉద్యోగులు ఏం చేస్తారో అని వేచి చూడాలి!