కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామం...టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు పుట్టిన గడ్డ. ఈ గ్రామం ప్రస్తుతం పామర్రు నియోజకవర్గ పరిధిలో ఉంది. 2009లో కొత్తగా ఏర్పడిన ఈ పామర్రు నియోజకవర్గంలో టీడీపీ ఇంతవరకు విజయం సాధించలేదు. 2009లో కాంగ్రెస్ గెలిస్తే, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ దాదాపు 30 వేల పైనే ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఇక టీడీపీ తరుపున పోటీ చేసిన ఉప్పులేటి కల్పన ఘోరంగా ఓడిపోయారు. అయితే కల్పన 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చారు. అందుకే 2019లో పామర్రు ప్రజలు ఘోరంగా ఓడించారు. ఇప్పటికీ కూడా పామర్రు నియోజకవర్గంలో వైసీపీ హవా స్పష్టంగా ఉంది. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉన్నా, ఇక్కడి ప్రజలు జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలనే చూస్తున్నారు. అలాగే ఇళ్ల పట్టాల పంపిణీ పెద్ద ప్లస్ కానుంది.

పైగా టీడీపీ కేడర్ యాక్టివ్‌గా లేదు. ఉప్పులేటి కల్పన నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం ఒక్కటీ చేయడం లేదు. ఓడిపోయిన దగ్గర నుంచి పామర్రులో కల్పన యాక్టివ్‌గా ఉండటం లేదు. దీని వల్ల నియోజకవర్గంలో టీడీపీ అసలు ఉందా అనే పరిస్థితికి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు పంచాయితీ ఎన్నికల సమరం మొదలైంది. ఈ పంచాయితీ సమరంలో వైసీపీకే ఫుల్ అడ్వాంటేజ్ కనిపిస్తోంది.

నియోజకవర్గంలో మెజారిటీ పంచాయితీలు వైసీపీ ఖాతాలో పడటం ఖాయమని తెలుస్తోంది. అయితే ఇప్పటికైనా ఉప్పులేటి కల్పన కేడర్‌ని యాక్టివ్ చేసి, పంచాయితీ పోరులో గట్టి పోటీ ఇస్తే ఏమన్నా ఫలితం ఉంటుంది. లేదంటే ఎన్టీఆర్ అడ్డాలో కూడా ఫ్యాన్ హవా ఉండటం ఖాయం. ఏదేమైనా పామర్రు నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద సీన్ లేనట్లే ఉంది. మొత్తానికైతే ఇక్కడ వైసీపీ తిరుగులేని ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: