సాయిరెడ్డి విశాఖ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న మాట వాస్తవమే. అయితే.. అది కొంత వరకు మాత్రమే పరిమితం. జిల్లాలోని పట్టణాలు నగరాల వరకే ఆయన హవా చలామణి అవుతోంది. ఎమ్మెల్యేలపై హల్చల్ చేస్తున్నమాట కూడా వాస్తవమే అయితే.. దీనిని అందరూ యాక్సెప్ట్ చేయడం లేదు. ఆయన దూకుడు యాక్సప్ట్ చేసిన వారిలోనూ సాయిరెడ్డికి అనుకూలంగా ఉన్నవారు తక్కువ మందే ఉన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సాయిరెడ్డి హవా ఏమీ ఎక్కువగా కనిపించడం లేదు. ప్రెస్మీట్లు, నోట్లు.. ప్రకటనలు.. అధికారులపై ఆధిపత్యం వంటివాటిలో మాత్రమే సాయిరెడ్డి దూకుడు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజలపై సాయిరెడ్డి ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు.
నగరాలు, పట్టణాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. గ్రామీణ స్థాయిలో సాయిరెడ్డి హవా ఎక్కడా లేదు. దీంతో వైసీపీకి ఓట్లు రాలాలన్నా.. వైసీపీ మద్దతిచ్చిన వారు గెలుపుగుర్రం ఎక్కాలన్నా కూడా.. కేవలం అయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జ్లపైనే ఆధారపడి ఉంది. ఇక ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. నగర రాజకీయాల్లో ఎక్కడ పడితే అక్కడ వేలు పెడుతూ హడావిడి చేయడంతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో అన్నీ తానై వ్యవహరించిన సాయిరెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మొత్తంగా ఈ పరిణామం.. రాజకీయంగా సాయిరెడ్డికి మైనస్ మార్కులు వేసేలా చేసింది.
నిజానికి సాయిరెడ్డిపై ఆగ్రహంతో ఉన్న నాయకులు చాలా మంది ఇదే మంచి అవకాశం అని భావిస్తున్నారు. ఇప్పటి వరకు సాయిరెడ్డి అంతా తానై వ్యవహరించారు. దీంతో తమకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న నాయకులు ఇప్పుడు తమ సత్తాచాటి .. సాయిరెడ్డి హవాకు బ్రేకులు వేయాలని చూస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.