పీఆర్సీ నివేదికపై టీఎన్జీఓ, టీజీఓ, సచివాలయ సంఘం ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని అధికారుల కమిటీ చర్చలు జరిపింది. ఆయా సంఘాల అభిప్రాయాలు, విజ్ఞప్తులను తీసుకొంది. వేతన సవరణ సంఘం నివేదిక తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని... దాన్ని చెత్తబుట్టలో వేసినట్లేనని టీఎన్జీఓ, టీజీఓ సంఘాలు ఈ సందర్భంగా త్రిసభ్య కమిటికి తేల్చి చెప్పాయి.
కమిషన్ నివేదించిన ఏడున్నర శాతం ఫిట్మెంట్ను ఉద్యోగులు జీర్ణించుకోవడం లేదని... పీఆర్సీ పే రిడక్షన్ కమిటీగా, పిసినారి కమిటీగా మారిందని ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానించాయి.
సీఎస్ తో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన టీఎన్జీఓ, టీజీఓ, సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు.. పీఆర్సీ కమిషన్ కేవలం సిఫార్సులు చేసిందని చెప్పారు. ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి మెరుగైన పీఆర్సీ సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన 43 శాతం కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాలని కోరారు. మంత్రులను కలుస్తామని, లాబీయింగ్ చేస్తామని... ముఖ్యమంత్రిని ఒప్పించి మెరుగైన ఫిట్మెంట్ సాధిస్తామన్నారు. నెలాఖరులో పదవీ విరమణ చేసే వారికి కూడా వయసు పెంపు వర్తించాలని కోరినట్లు చెప్పారు ఉద్యోగ సంఘాల నేతలు. పీఆర్సీ కమిటీ అశాస్త్రీయంగా నివేదిక ఇచ్చిందన్నారు. కుటుంబానికి ముగ్గురిని యూనిట్గా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదన్న టీఎన్జీఓ, టీజీఓలు... గత ప్రభుత్వాలతో వ్యవహరించినట్లే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంతో లౌక్యంతో వ్యవహరిస్తున్నామని, లౌక్యంతో సాధ్యం కానప్పుడు మరో మార్గంలో ఆలోచిస్తామని తెలిపారు.