మనిషి చనిపోతే కూడా విలువ ఇవ్వని నేటి సమాజంలో ఒక్క వీధి కుక్క మరణంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా ఆ కాలనీ వాసులంతా సంతాపం పాటిస్తున్నారు. ఇక కుక్క మృతికి సంతాపంగా పోస్టర్లు కూడా వెలిశాయి. మనకు తెలిసినంత వరకు మనిషి చనిపోతే పోస్టర్లు వేస్తారు.. మరి కుక్క మరణిస్తే పోస్టర్లు వెలియడమేంటీ? కేరళలోని పథానమ్‌తిట్టా జిల్లా మనక్కల వాసులను ఇదే విషయం గురించి ప్రశ్నిస్తే.. అదంతే అని చెప్తున్నారు. తమ కుటుంబసభ్యుడిని కోల్పోయినట్లుగా బాధపడుతున్నామని చెప్పారు. కళ్ల ముందే ఆ శునకం ప్రాణాలు పోతున్నా.. కాపాడలేక, చివరికి ఇలా నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాత్రి వేళల్లో ఈ వీధి కుక్క తమకు ఎంతో రక్షణగా నిలిచేదని కాలనీవాసులు చెప్పారు. దానికి ‘రమణీ’ అని పేరు పెట్టుకొని ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఆ శునకంతో తమ బంధం నాలుగేళ్లుగా కొనసాగుతోందని తెలిపారు. కాలేజీ జంక్షన్ సమీపంలో ఉండే ఆ కాలనీలో వివిధ షాపులు ఉన్నాయి. రాత్రి వేళ ఆ షాపులన్నింటికీ రమణీ సెక్యూరిటీ గార్డుగా ఉండేదని దుకాణదారులు తెలిపారు. కొన్ని రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో ఆ శునకం దుర్మరణం చెందింది. ‘వెంట వెంటనే రెండు వాహనాలు రమణీ మీద నుంచి వెళ్లిపోయాయి. నా కళ్ల ముందే ఈ ఘటన జరిగింది. దాన్ని కాపాడలేకపోయా. అందుకే ఇలా నివాళి అర్పిస్తున్నా..’ అని ప్రదీప్ పలారా అన్నాడు. ఆ వీధిలో అతడు టైర్ల షాపు నిర్వహిస్తున్నాడు. ఆ షాక్ నుంచి తానింకా తేరుకోలేదని చెప్పాడు.

‘అయితే నాలుగేళ్లుగా రమణీ మాతో కలిసి జీవిస్తోంది. ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు. పైగా దొంగల నుంచి మాకు రక్షణ కల్పించేది. రమణీ ఉందనే ధైర్యంతో రాత్రిళ్లు మేం హాయిగా నిద్రపోయేవాళ్లం. రమణీ లేని లోటు పూడ్చలేనిది’ అంటూ మరో దుకాణదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎరతు పంచాయతీ సిబ్బంది ఆ శునకానికి స్టెరిలైజేషన్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో వదిలేశారు. నాటి నుంచి అది అక్కడే ఉంటోంది. కాలనీవాసులతో కలిసిపోయింది. ఇప్పుడు దాని మృతికి సంతాపంగా ఆ కాలనీ నిండా పోస్టర్లు వెలిశాయి. మనిషికి జంతువులకు మధ్య విడదీయరాని బంధానికి ఈ ఘటన ఒక ఉదాహరణ.

మరింత సమాచారం తెలుసుకోండి: