సంక్షేమ రంగానికి మాత్రమే పెద్ద పీఠవేస్తూ అభివృద్ధి అంశాలను పట్టించుకోవడం లేదని, ఉద్యోగ వర్గాలను విస్మరిస్తున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పన జరగడం లేదని ఇలా చాలా రకాలుగా రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వర్గాల సంఖ్య మిక్కిలిగానే ఉంది.
జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక హామీలిచ్చారు. అందులో ఇప్పటి వరకు నెరవేర్చినవి.. నెరవేర్చేందుకు బాటలు పరుచుకున్నవి బహు తక్కువ. ప్రభుత్వం వైఫల్యం కాలేదు.. పరిపాలన భేషుగ్గా జరుగుతోందని జగన్మోహన్రెడ్డి ప్రజలను మెస్మరైజ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తంగా జగన్మోహన్రెడ్డి స్కెచ్లు పారడం లేదని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ రహిత ఎన్నికలే అయినప్పటికీ టీడీపీ మద్దతు పొందిన అభ్యర్థులే గ్రామాల్లో విజయం సాధిస్తారన్న వాదనను ఆ పార్టీ నాయకులు బల్లగుద్ది చెబుతున్నారు.
చంద్రబాబు వైఫల్యం చెందారని... యువనాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని భావించి జగన్మోహన్రెడ్డిని ఏపీ ప్రజలు సీఎం చేశారని, ఆయన ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలం చెందడంతో... ఇప్పుడు అదే అంశంలో ఈ రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబులాంటి నేత నాయకత్వం అవసరమని ప్రజలు గుర్తిస్తున్నారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తితో పాటు టీడీపీపై ఈ రాష్ట్ర ప్రజలకున్న అభిమానం తెలుస్తుందని పేర్కొంటున్నారు. ఏపీలో స్థానిక ఎన్నికలు జరగకుండా సుదీర్ఘకాలంగా కోర్టుల్లో జాప్యం జరిగేలా చూసిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కిందని ఎద్దేవా చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారడం ఖాయమని పేర్కొంటున్నారు.