ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆయా పంచాయతీల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు కూడా సిద్ధమవుతున్నారు. అయితే కొన్ని సార్లు సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు వేసిన నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరిస్తుంది. నామినేషన్ల గడువు ముగిసే లోపల పూర్తి వివరాలతో నామినేషన్లు వేస్తేనే ఆ అభ్యర్థిని పోటీకి అర్హుడిగా ఈసీ పరిగణలోకి తీసుకుని అతడి పేరును జాబితాలోకి చేర్చుతుంది. అంతేకాదు ఈ పదవికి పోటీచేయాలనకునేవారు కలిగి ఉండాల్సిన కనీస అర్హతలను కూడా ఈసీ ప్రకటించింది. ఆ అర్హతలు కలిగి ఉన్న వారు మాత్రమే పోటీకి అర్హులు. ఈ క్రమంలో అసలు పదవికి పోటీ చేయాలంటే కావలసిన అర్హతలు, అనర్హతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాజ్యాంగ బద్ధమైన అర్హతలు:
1. దరఖాస్తు చేసేనాటికి అభ్యర్థి వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి.  
2. పోటీ చేసే గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో తప్పని సరిగా అతడు ఓటరుగా నమోదై ఉండాలి. ఒక చోట ఓటు ఉన్న వ్యక్తులు మరో చోట పోటీకి అనర్హులు.
3. ఇద్దరికంటే ఎక్కువ బిడ్డలుంటే ఎన్నికలలో పోటీకి అనర్హులు. అయితే ఇందుకు ఓ మినహాయింపు ఉంది. సదరు అభ్యర్థికి 1995 మే 31 కంటే ముందే ఇద్దరి కంటే ఎక్కువ మంది బిడ్డలుంటే అప్పుడు అతడు పోటీకి అర్హుడే.
4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు పోటీకి అర్హులు కాదు. నామినేషన్‌ పరిశీలన తేదీ నాటికి పోటీ చేస్తున్న వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి అది ఆమోదించిన తర్వాత మాత్రమే పోటీకి అర్హులుగా పరిగణించి నామినేషన్‌ పరిశీలన చేస్తారు.
5. అంగన్‌వాడీ వర్కర్లు, నీటి వినియోగదారుల సంఘం సభ్యులకు అవకాశం లేదు.
6. స్వచ్ఛంద, మత సంబంధ సంస్థల చైర్మన్లు, సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. 1987 హిందూ మత సంస్థలు చట్టం, దేవదాయ శాఖ సెక్షన్‌ ప్రకారం సంస్థలు ఏర్పాటయ్యాయి.
7. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసే వారు అనర్హులు.
8. మతిస్థిమితం లేని వ్యక్తి పోటీకి అనర్హుడు.
9. పోటీ చేస్తున్న వ్యక్తిపై నేరారోపణపై శిక్షపడి దోషిగా నిర్ధారిస్తే పోటీకి అనర్హుడు.

పిల్లలు కూడా కీలకమే..
1. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. బిడ్డలను ఎవరికైనా దత్తత ఇచ్చినప్పటికీ వారిని సొంత తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగానే పరిగణలోకి తీసుకుంటారు. దత్తత తీసుకున్న తల్లిదండ్రుల బిడ్డలుగా పరిగణించరు.
2. ఒక వ్యక్తి తన మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఆ తరువాత భార్య చనిపోవడంతో ఒకవేళ రెండో పెళ్లి చేసుకొని మరో సంతానాన్ని పొందితే అతనికి ముగ్గురు సంతానంగానే పరిగణిస్తారు. అయితే అతడి రెండో భార్యకు మాత్రం ఒక్క సంతానమే కనుక ఆమెను పోటీకి అర్హురాలిగానే పరిగణిస్తారు.
3. ముగ్గురు పిల్లలున్న వ్యక్తికి నామినేషన్‌ పరిశీలనకు ముందు ఒకరు చనిపోతే ప్రస్తుతం ఉన్న పిల్లలను మాత్రమే లెక్కలోకి తీసుకుని అతని అర్హతలను నిర్ణయిస్తారు. ఇద్దరు పిల్లలున్న తరువాత భార్య గర్భవతి అయినా పోటీకి అనర్హులు.


నామినేషన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
1. అభ్యర్థికి ప్రతిపాదకుడిగా ఉన్న వ్యక్తి అదే వార్డు, ప్రాదేశిక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి.  
2. అభ్యర్థిపై ఇతరులు ఫిర్యాదు చేస్తే దానికి రిటర్నింగ్‌ అధికారి అభ్యర్థి ఇచ్చిన సమాచారం తప్పు అని భావిస్తే ఐసీసీ సెక్షన్‌ 177, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 195 ప్రకారం అదే ప్రాంతానికి చెందిన న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలి. అయితే నామినేషన్‌ మాత్రం తిరస్కరించడానికి వీలు లేదు.
3. నామినేషన్‌ వేస్తున్న వ్యక్తి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అదే రోజు ఇవ్వకపోయినా నామినేషన్‌ తీసుకుంటారు. చెక్‌ లిస్టులో ఎలాంటి పత్రాలు సమర్పించలేదని నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లు నామినేషన్ల చివరి తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. ఆ తర్వాత ఇచ్చినా స్వీకరించరు. అయితే నామినేషన్‌ తిరస్కరణపై ఆ తరువాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
4. పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రతిపాదకుడు నామినేషన్‌ పత్రాలపై సంతకం పెట్టకుంటే అపిడవిట్‌ సమర్పించాలి. కానీ దానికి రిటర్నింగ్‌ అధికారి తనంతట తాను సంతృప్తి పొందాలి. ప్రతిపాదకుడి సంతకం ఫోర్జరీ అని తేలితే క్షుణ్ణంగా పరిశీలించి, విచారించిన తరువాత ఆ నామినేషన్‌ తిరస్కరించే అధికారం రిటర్నింగ్‌ అధికారికి ఉంటుంది.
5. ఒక వ్యక్తి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం.. గరిష్టంగా నాలుగు నామినేషన్లు వేయవచ్చు. చెల్లుబాటు జాబితాలో అతని పేరు ఒక్కసారి మాత్రమే రాస్తారు. చెల్లుబాటు జాబితా ప్రకటించేవరకు నిరీక్షించి అభ్యర్థి తన నామినేషన్‌ ఉపసంహరించుకోవాలి.
6. నామినేషన్‌ వేయటానికి అభ్యర్థి, ప్రతిపాదకునితోపాటు మరో ముగ్గురిని మాత్రమే రిటర్నింగ్‌ అధికారి తమ గదిలోకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది.
7. నామినేషన్‌లో అభ్యర్థి సంతకం మరచిపోతే దానిని తిరస్కరించవచ్చు. ఒక్కసారి నామినేషన్‌ వేసిన తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదు.
8. అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరణకు నోటీసుపై స్వయంగా సంతకం చేసి నమూనాలో సమయంలోపు రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థి ఇవ్వలేని సమయంలో రాత పూర్వకంగా అధికారం ఉన్న ప్రతిపాదకుడు ఎన్నికల ఏజెంట్‌ ద్వారా రిటర్నింగ్‌ అధికారికి సమర్పించేందుకూ అవకాశం కల్పిస్తారు.
9. రిటర్నింగ్‌ అధికారి నామినేషన్‌ తిరస్కరిస్తే దానికి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం మరుసటి రోజు సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డీవోకు అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారి నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్‌ చేసుకునే అధికారం అభ్యర్థికి ఉంటుంది.


నామినేషన్‌ డిపాజిట్‌ ఇలా చేయాలి..
1. వార్డు సభ్యుడి పదవికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు నామినేషన్‌ రుసుం కింద రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాలి.
2. సర్పంచ్‌ పదవికి పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000, ఇతరులు అయితే రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

పై అర్హతలన్నీ కలిగి ఉండి, నామినేషన్ వేశాక.. ఇక ఈసీ నిర్ణయించిన సమయం వరకు తన నియోజకర్గంలో ప్రచారం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఆ తరువాత ప్రజా ఓటింగ్‌తో విజేతను ఈసీ నిర్ణయిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: