పంజాబ్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని, అక్కడ ఓ చట్టం తీసుకొచ్చారని, ఆ చట్టాన్ని రైతులు అతిక్రమిస్తే ఏకంగా జైలుకే పంపించేలా ఉందని, దానిపై కూడా రాహుల్ మాట్లాడరని ఎద్దేవా చేశారు. అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, రాహుల్ గాంధీ, లెఫ్ట్ పార్టీలు కపట రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
రాజకీయం అంటే అధికారం చేజిక్కించుకోవడం కాదని, దానికోసం ఇక్కడ ఓ పార్టీతో అంటకాగడం, అక్కడ మరో పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎంత మాత్రం సరి కాదని అన్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు విచిత్రమైన రాజకీయానికి తెర తీశాయని, వాటి ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు మిత్ర పక్షాలుగా ఉన్నాయని, కానీ కేరళలో మాత్రం ఇవి ప్రత్యర్థి పార్టీలుగా పోటీపడుతున్నాయని విమర్శించారు. కేరళలో కుస్తీ, ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో దోస్తీ.. ఇదెక్కడి రాజకీయమని జోషి మండిపడ్డారు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేతమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఢిల్లీలో కాంగ్రెస్కు మద్దతు పలుకుతారని, కానీ బెంగాల్ విషయంలో మాత్రం ఆమె కాంగ్రెస్ను వ్యతిరేకిస్తారని, ఇదెక్కడి విడ్డూరమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే లెఫ్ట్ పార్టీలు కూడా ఢిల్లీ, బెంగాల్, తమిళనాడుల్లో కాంగ్రెస్కు మద్దతు పలుకుతాయి. కానీ కేరళలో మాత్రం రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటారని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారో, కపట విధానాలను పాటిస్తారో తేల్చి చెప్పాలని నిలదీశారు.
అంతేకాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అఖండ విజయం సాధిస్తుందని, పుదుచ్చేరిలో తిరిగి ప్రభుత్వాన్ని నెలకొల్పుతుందని అన్నారు. ఇక కేరళలో కూడా ప్రస్తుతం బీజేపీ అనుకూల పవనాలు మొదలయ్యాయని, అతి త్వరలో అనేక మార్పులు తప్పవని, దేశ వ్యాప్తంగా కాషాయజెండా ఎగిరే రోజులు దగ్గరలో ఉన్నాయని జోస్యం చెప్పారు.