మహారాష్ట్రపై కరోనా పంజా విసిరింది. విదర్భ పరిధిలోని పలు ప్రాంతాల్లో అమాంతంగా కేసులు పెరగడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. విదర్భ పరిధిలోకివచ్చే జిల్లాలన్నింటికీ ఈనెల 28వ తేదీ వరకు రాకపోకలు నిషేధించారు. ఈ మేరకు పర్భణి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. మంగళవారం అర్థరాత్రి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా రవాణాశాఖ, ప్రయివేటు రవాణాశాఖ ఇద్దరికీ అ ఆదేశాలు వర్తిస్తాయన్నారు. పర్బణీ-విదర్బ మధ్య చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అత్యవసర సర్వీసుల్లో ఉన్నవారికే సడలింపు ఉంటుందని స్పష్టం చేశారు.
ఒక్క 23వ తేదీనే రాష్ట్రంలో 6218 కరోనా కేసులు నమోదయ్యాయి. 51 మంది కరోనాతో మృతి చెందారు. తాజాగా ముంబయి నగరంలో 643 కేసులు నమోదయ్యాయి. ఈ నెల 10 నుంచి మహారాష్ట్రలో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరి 10న 6112 కరోనా కేసులు నమోదవగా... ఫిబ్రవరి 19న 6112 కేసులు, ఫిబ్రవరి 20న 6971 కేసులు నమోదయ్యాయి. మంగళవారం నమోదైన కేసులతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 21,12,312కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 51,857కి చేరింది. ఇప్పటివరకూ 20,05,851 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఒక్క ముంబయి నగరంలోనే
మొత్తం కేసుల సంఖ్య 3,20,531కి చేరింది. గత రెండు రోజుల్లో వరుసగా 900,760 కేసుల చొప్పున నమోదయ్యాయి.
తాజాగా బయటపడ్డ కేసుల్లో మహారాష్ట్ర, కేరళల్లో SARS-CoV-2 N440K, E484K అనే రెండు కొత్త వేరియంట్స్ను కూడా గుర్తించారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలోని అకోలా, బుల్దానా,వషీమ్,అమరావతి, యావత్మల్ జిల్లాల్లో ఇప్పటికే పాక్షిక లాక్డౌన్ విధించారు. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించవచ్చన్న ప్రచారం ఊపందుకుంటోంది. అయితే ఈ ప్రచారాన్ని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఖండించారు. కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 12 రోజులు ముంబై నగరానికి చాలా కీలకమని, నిబంధనలు పాటించనివారిపట్ల బీఎంసీ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.