విశాఖలో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఈసారి ఎన్నికల్లో ఆకట్టుకునే వార్డులు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా  చెప్పుకోవాల్సింది. పెద్ద నాయకుల వారసులు బరిలో ఉన్నవి. అక్కడే అందరి అటెన్షన్ కూడా ఉంటోంది. వారిని కనుక ఓడిస్తే నైతికంగా దెబ్బ తీయవచ్చు అని అన్ని పార్టీల ఆలోచనగా ఉంది.

ఆ విధంగా చూసుకుంటే జీవీఎంసీ ఎన్నికలో ఆరవ వార్డు నుంచి మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రియాంక  పోటీ చేస్తున్నారు. ఈ వార్డు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ వార్డు విశాఖ సిటీకి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వార్డులో వైసీపీ జెండా ఎగరేయడానికి మంత్రి తన కూతురిని బరిలోకి దింపారు. ముఖ్యామంత్రి జగన్ అయితే బంధువులు, వారసులను బరిలోకి దించవద్దని ఆదేశాలు ఇచ్చినా కూడా మంత్రి మాత్రం తమ కుమార్తె చేత నామినేషన్ వేయించారు. విజయసాయిరెడ్డి దీవెనలతో ఆమె రంగంలో ఉన్నారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే మంత్రి కూతురుకి విజయావకాశాలు ఎలా ఉన్నాయి అన్న చర్చ వచ్చినపుడు చూస్తే ఇది టఫ్ గా ఉండే పోటీయే అని అర్ధమవుతోంది. ఇక్కడ  బీసీలు ఎక్కువ మంది ఉంటారు. పైగా టీడీపీ జనసేన వంటి పార్టీలు కూడా ఈ వార్డు మీద దృష్టి పెట్టాయి. మంత్రి కూతురు నాన్ లోకల్ అన్న కార్డు తో ప్రతిపక్షాలు  ప్రచారం చేస్తున్నాయి. తామంతా పక్కా లోకల్ అని ప్రజా సమస్యలు తెలుసు అని చెబుతున్నారు. మంత్రి కూతురుని గెలిపిస్తే ఆమె మళ్లీ కనిపించరని కూడా జనాల్లో విపక్షాలు పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తునాయి. మరి ఇది కనుక ప్రజల మెదళ్ళకు ఎక్కిందంటే మాత్రం లక్ష్మీ ప్రియాంకకు కష్టమేనని అంటున్నారు.

ఇదిలా ఉంటే డాక్టర్ చదివిన లక్ష్మీ ప్రియాంక విశాఖలో  తండ్రి స్థాపించిన విద్యా సంస్థలను చూసుకుంటున్నారు. ఆమె మంత్రి వెంట తిరిగి ఆయన గెలుపులో గతంలో తన వంతు పాత్ర పోషించారు. ఆమెకు రాజకీయాల మీద ఆసక్తి ఉండడంతో పోటీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆమె కనుక గెలిస్తే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ అవుతారని కూడా ప్రచారంలో ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: