ఇది ఒక రకంగా చంద్రబాబు రాజకీయ ఉనికినే ప్రశ్నిస్తున్న ఫలితాలుగా చెప్పుకోవాలి. ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి కేవలం 14 పంచాయతీ స్థానాలే దక్కడం.. వైసీపీ మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన చర్చగా నిలుస్తోంది. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 89 పంచాయతీలకు గానూ 75 పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకోవడం సంచలనం అనే చెప్పాలి. పార్టీ అధినేత సొంత నియోజకవర్గంలో టీడీపీ కేవలం 14 స్థానాలకే పరిమితం కావడంపై తెలుగు తమ్ముళ్లు సైతం షాకవుతున్నారు. కుప్పం నేతలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారంట. ఎక్కడ తప్పు జరిగిందనే అంశంపై పార్టీ నేతలను ప్రశ్నించినా సమాధానం కరువవుతోంది. తప్పు మీదంటే మీదంటూ కుప్పం నేతలు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
కుప్పం పంచాయతీ ఫలితాలతో తీవ్ర మనోవోదనకు ఆ పార్టీ ముఖ్య నేతలు గురవుతున్నట్లుగా తెలుస్తోంది. అధినేత ఇలాఖాలోనే గెలవలేకపోవడంతో వారు ముఖాలు చూపించలేకపోతున్నారట. బాబు కుప్పం రాబోతున్న క్రమంలో ఆయనకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని చర్చ జరుగుతుంది. అందుకే రాజీనామా చేయాలని భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న పీఎస్ మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్ ఏం చేయాలనేదానిపై ఇప్పటికే కార్యకర్తలతో చర్చించారు. కుప్పం వచ్చిన మునిరత్నం, చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్లకు స్థానికంగా చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు నేతలపై కార్యకర్తలు తిరుగుబాటు యత్నించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా టీడీపీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా, 75 పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. పది పంచాయతీల్లో టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఈ ఫలితాలను ప్రతిపక్ష నేతను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఎవరు చేసిన తప్పిదాలకు వారే బాధ్యత వహించకతప్పదనే రీతిలో చంద్రబాబు ఓటమిని ఎదుర్కొంటున్నారు.