ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ రాజధాని విషయంలో జగన్ రివర్స్ మూడ్ లో ఉన్నారని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం మొదలెట్టేసింది. దానికి ప్రాతిపదిక ఏంటి అంటే అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మానానికి మూడు వేల కోట్ల రూపాయ నిధులను బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చి సేకరించాలని తాజాగా మంత్రివర్గం నిర్ణయించింది. దాంతో విశాఖ రాజధాని ఇక ఉండదు, జగన్ తన మనసు మార్చుకున్నారు అని టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ విధంగా చేయడం వెనక జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ గెలిచే వ్యూహం ఉందని అంటున్నారు. ఎందుకంటే విశాఖకు రాజధాని అంటే కొంత మొగ్గు వైసీపీకి ఉంటుంది. రాజధాని విశాఖ కాదు, జగన్ నిర్ణయం మారింది అంటే ఆ మేరకు కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
దాంతో ఈ రకమైన వ్యూహాన్ని టీడీపీ తన అనుకూల మీడియా ద్వారా అమలు చేస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది. దాంతో ఇది పెద్ద డ్యామేజ్ చేయబొతోంది అని గ్రహించిన వైసీపీ వెంటనేనష్ట నివారణ చర్యలకు దిగిపోయింది. విశాఖ రాజధాని విషయంలో తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్ని నాని తాజాగా ప్రకటించడం అందులో భాగమే అంటున్నారు. విశాఖ రాజధాని ఖాయమని ఇవాళ కాకపోతే రేపు అయినా విశాఖ నుంచే వైసీపీ పాలన మొదలుపెడుతుందని ఆయన పక్కా క్లారిటీగా చెప్పేసారు. మొత్తానికి చూస్తే విశాఖలో ఎన్నికలు కాదు కానీ రాజధాని అంశం చుట్టే అంతా తిరుగుతోంది అంటున్నారు.