భారత  ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో మాజీ కాబోతున్నారా? బీజేపీ నిర్ణయాలు అలాగే ఉన్నాయా?  అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత,  ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్. అందుకు ఆయన బలమైన ఆధారాలు కూడా చూపిస్తున్నారు. గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్  మొతేరా క్రికెట్ స్టేడియంకు నరేంద్రమోడీ పేరు పెట్టడంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి సెటైర్లు వేశారు. మోడీకి రిటైర్ కావాల్సిన సమయం దగ్గర పడిందని అందుకే మొతేరా స్టేడియంకు తన పేరు పెట్టుకున్నారని భూపేష్ బాఘేల్ ఎద్దేవా చేశారు.

     ఈ మాట తానేదో సెటైర్ వేయడానికి చెప్పట్లేదని, వాస్తవానికి బీజేపీ సంప్రదాయం ఇదేనని చెప్పారు భాగల్. ‘‘భారతీయ జనతా పార్టీకి ఒక సంప్రదాయం ఉంది. అటల్ బిహారీ వాజిపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ‘అటల్ చౌక్’ అని పేరు పెట్టారు. కానీ ఆయన ఆ తర్వాత ప్రధాని పదవి కోల్పోయారు. ఇప్పుడు మొతేరా క్రికెట్ స్టేడియంకు నరేంద్రమోడీ పేరు పెట్టారు. దీన్ని బట్టి ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే నరేంద్రమోడీ ప్రధాని నుంచి మాజీ ప్రధాని కాబోతున్నారనేది స్పష్టం’’ అని భూపేష్ బాఘేల్ అన్నారు.

 ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని మొతెరా క్రికెట్ స్టేడియం పేరు మారిపోయింది. పునర్నిర్మాణానికి ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అని ఉన్న ఈ పేరును తాజాగా నరేంద్రమోడీ స్టేడియంగా పేరుగా మార్చారు. ఇంగ్లండ్-ఇండియా టెస్ట్ మ్యాచ్‌కి ముందు ఈ పేరు మార్చినట్లు బుధవారం ప్రకటించారు. ఈ స్టేడియంకు సర్దార్ పేరు ఉన్నప్పటికీ మొతేరా అనే ప్రాంతంలో ఉండడం వల్ల దీనిని వాడుకలో మొతేరా స్టేడియం అని కూడా పిలుస్తుంటారు.అయితే పటేల్ పేరుతో ఉన్న స్టేడియానికి మోడీ పేరు పెట్టడంపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వస్తున్నాయి.సర్దార్ పటేల్ పై గొప్పగా ప్రకటనలు చేసే బీజేపీ నేతలు.. ఇప్పుడు చేసింది ఏమిటి అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: