2013లో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించే వరకు కేశినేని నాని.. కేవలంటూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేతగా కొందరికి మాత్రమే పరిచయం. అయితే.. పాదయాత్ర సమయంలో ఆయన టీడీపీలో యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే 2014లో విజయవాడ ఎంపీ టికెట్ సంపాయించుకుని.. తొలి విజయం దక్కించుకున్నారు. దీంతో అప్పటి వరకు విజయవాడలో కీలక నేతగా ఉన్న వారు కూడా నానికి జై కొట్టారు. అయితే.. ఇలా జైకొట్టిన వారంతా కూడా సీనియర్లు కావడం గమనార్హం. అయినప్పటికీ.. వారంతా చంద్రబాబు దగ్గర మంచి గుర్తింపు ఉన్న నానికి చేరువయ్యారు.
ఈ క్రమంలోనే ఐదేళ్లు ఆయన వెంట నడిచారు. అయితే.. 2019లో టీడీపీ ఓడిపోవడం.. తర్వాత పార్టీలో తనను గుర్తించడంలేదనే వాదనతో నాని.. విమర్శల బాట పట్టారు. చంద్రబాబుపైనా.. స్థానిక నేతలపై నా.. మాజీ మంత్రిపైనా విమర్శలు గుప్పించారు. ఇది పార్టీలో విభేదాలకు దారితీసింది. అయినా.. చంద్రబాబుకొన్నాళ్లు సర్దుబాటు చేశారు. ఈ క్రమంలోనే నాని కోరినట్టు విజయవాడ మేయర్ పీఠాన్ని ఆయన కుమార్తె శ్వేతకు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే.. గడిచిన ఏడాది కాలంగా నాని పార్టీకి చేసింది ఏమీ కనిపించకపోగా.. టీడీపీ నేతలను కాదని.. బీజేపీ నేతలతో టచ్లో ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పైగా తనను ప్రశ్నించేందుకు ఎవరికీ అర్హత లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఇది తాజాగా కార్పొరేషన్ ఎన్నికల్లో మరింత తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో ఎవరైతే.. నానికి జై కొట్టారో.. ఇప్పుడు వారే ఆయన ఛీ కొడుతున్నారు. గతంలో జై కొట్టిన చేతులే.. ఇప్పుడు అడ్డు పడుతున్నాయి. ఆయన ఉంటే.. పార్టీ నాశనం కావడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ టీడీపీలో నాని విషయం.. ఆయన రాజకీయం తీవ్ర దుమారం రేపుతోంది. పైకి చంద్రబాబు సర్దుబాటు చేసినట్టు కనిపిస్తున్నా.. మున్ముందు.. ఇది పేలిపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.