అధికార పార్టీలో పోరు ఇలా ఉంటే.. టీడీపీ... బీజేపీలో ఆసక్తికర యుద్ధం నడుస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన టీజీ భరత్ పార్టీ ఇన్ చార్జ్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు కార్నూలు కార్పొరేషన్ వార్లో పార్టీ ఇన్ చార్జ్గా ఆయనే టీడీపీ బాధ్యతలు చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భరత్ స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠంపై టీడీపీ వ్యక్తే ఉండాలని కసితో ముందుకు వెళుతున్నారు.
అయితే భరత్కు సొంత తండ్రి అయిన టీజీ వెంకటేష్ నుంచే సవాళ్లు ఎదురవుతున్నాయి. బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీజీ ఈ ఎన్నికల కోసం ప్రత్యేక మైన ప్లానింగ్తో ముందుకు వెళుతున్నారు. ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు పాత నేతలతో కమిటీ వేసి మరీ ముందుకు వెళుతున్నారు. ఇక్కడ సత్తా చాటి తన పట్టు నిలుపుకోవాలని ఆయన చూస్తున్నారు. తండ్రి, కొడుకులు ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు పార్టీల తరపున ప్రచారం చేస్తుండడంతో నగర వాసుల్లో అయోమయం నెలకొంది.