షర్మిల పార్టీతో చేరితో నియోజకవర్గ నేతలుగా ఎదగవచ్చు అన్న ఆలోచనతో ఆమెను నేరుగా లోటస్ పాండ్ వెళ్లి కలిసి వస్తుండటంతో కాంగ్రెస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోందంట. ఇప్పటికే దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్న షర్మిల ఏకంగా భారీ బహిరంగ సభతో పార్టీకి ఊపు తీసుకురావాలనే యోచనతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అందులో భాగంగానే ఏప్రిల్ 9న జనం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో లక్ష మందితో భారీ సభ ఏర్పాటు చేసి.. అదే వేదికపై పార్టీ ఏజెండా, విధి విధానాలను ప్రకటించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003 ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి వైఎ్సఆర్ తన పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తేదీనే ఖమ్మంలో పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించి జనంలోకి వెళ్లాలని షర్మిల భావిస్తున్నారంట.
ఇదే విషయంపై ఖమ్మం నుంచి వచ్చిన పలువురు వైఎ్సఆర్ అభిమానులు గురువారం లోట్సపాండ్లో షర్మిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 9న ఖమ్మంలో సభ నిర్వహణపై చర్చించినట్లు సమాచారం. బుధవారం విద్యార్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లుగానే మేలో మహిళలతోనూ సమావేశం నిర్వహించాలని షర్మిల బృందం భావిస్తోంది. అలాగే త్వరలోనే షర్మిల చేవెళ్ల నుంచి పాదయాత్ర చేస్తారని రాష్ట్రమంతా పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్న తర్వాతే పార్టీ విధానాలు, ఏజెండాలకు రూపకల్పన చేస్తారని తెలుస్తోంది.