విశాఖ మేయర్ అంటే దానికి ఉండే దర్జా దర్పం వేరు. కాస్మోపాలిటిన్ సిటీగా ఉన్న విశాఖ ఆసియా ఖండంలోనే శరవేగంగా ఎదుగుతోంది. విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. విశాఖ ప్రధమ పౌరుడు కావడం అంటే గర్వం గౌరవం కూడా. ఇపుడు ఆ హోదా ఎవరిని వరిస్తుంది అన్నదే చర్చగా ఉంది.

వైసీపీలో మేయర్ అభ్యర్ధిగా సిటీ ప్రెసిడెంట్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ని అధినాయకత్వం ఎంపిక చేసి పెట్టుకుంది. ఏమైనా అనూహ్య పరిస్థితులు వస్తే తప్ప ఆయన పేరు దాదాపుగా ఖరార్ అయినట్లే. ఇక టీడీపీ విషయానికి వస్తే రేసులో నలుగురు ఉన్నారు. ఇందులో ముగ్గురు పార్టీకి పాత కాపులే, ఒకరు మాత్రం అయిదేళ్ల క్రితం టీడీపీలోకి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వచ్చి చేరారు. ఆయనే మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ. ఆయన మొదట కాంగ్రెస్ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ ఇపుడు టీడీపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

ఆయన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ శిష్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ చలువతో ఆ గాలిలో 2004 ఎన్నికల్లో అప్పటి పరవాడ నియోజకవర్గం నుంచి టీడీపీ దిగ్గజం బండారు సత్యనారాయణమూర్తిని ఓడించి గెలిచారు. 2009 నాటికి పరవాడ కాస్తా పెందుర్తి నియోజకవర్గంగా మారిపోయింది. దాంతో అక్కడ పోటీ చేసినా బాబ్జీ ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తరువాత టీడీపీలో చేరిపోయారు.

చంద్రబాబు ఆయనకు వెలమ కార్పొరేషన్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించారు. అయితే ఆయన 2019 ఎన్నికల్లో పెందుర్తి టికెట్ అడిగినా దక్కలేదు. దానికి బదులుగా ఇపుడు విశాఖ మేయర్ సీటు ఇస్తారని ప్రచారంలో ఉంది. ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన బాబ్జీ ఇపుడు కార్పోరేటర్ గా పోటీ చేస్తున్నారు. టీడీపీకి మెజారిటీ సీట్లు వస్తే కనుక సీనియర్ గా బాబ్జీకి అవకాశం ఉంటుందని ఆయన వర్గీయులు గట్టిగా చెబుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: