రాష్ట్రంలో 2015లో విద్యుత్ చార్జీలు పెరిగాయి. అప్పట్లో 100 నుంచి 200 యూనిట్ల విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు 4 శాతం, 200 యూనిట్ల కన్నా ఎక్కువ వినియోగించే వారికి 5.75 శాతం పెంచారు. కమర్షియల్, పారిశ్రామిక కస్టమర్లకు అన్ని రకాల చార్జీలపై 5.75 శాతం దాకా పెరిగింది. దీంతో 825.61 కోట్ల మేర అదనపు ఆదాయం...డిస్కంలకు సమకూరింది. ఇప్పుడు దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ 2వేల కోట్లు... ఎన్పీడీసీఎల్ మరో 600 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు అంచనా. ఈ లోటును పూడ్చుకోవడానికి చార్జీలు పెంచక తప్పదని భావిస్తున్నాయి. డిస్కంల నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
విద్యుత్ ఛార్జీలను పెంచడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, పాల ధరలు పెరిగి పోవడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. అదే జరిగితే ఇది ప్రభుత్వానికి పెద్ద మైనస్ గా మారే అవకాశముంది.