దేశవ్యాప్తంగా ఎప్పుడు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బారతీయ జనతాపార్టీ తరఫున పాల్గొనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమత్షాలు అక్కడి ఓటర్లను ఆకట్టుకోవడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకునేవారు. సరైన సమయంలో సరైన విదంగా ప్రజలకు ఓట్ల కోసం ఎర వేయడంలో వీరిద్దరూ దిట్ట అని పేరుతెచ్చుకున్నారు. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీరిద్దరికంటే రెండాకులు ఎక్కువే చదివానని. పోకచెక్కతో నువ్వొకటంటే.. తలుపుచెక్కతో నేను రెండంటానని నిరూపించుకున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ హోరాహోరీగా తలపడుతున్న సంగతి తెలిసిందే.
ప్రజల్ని ఆకట్టుకునేందుకు మోదీ, అమిత్ షా తమ పర్యటనల్లో కేంద్రం తరఫున బెంగాల్ కు భారీ ప్రాజెక్టులెన్నో ప్రకటిస్తుండగా, ఇప్పుడు మమత వారికి ధీటుగా తన అమ్ములపొది నుంచి ఒక బాణాన్ని సంధించారు.
కొద్ది సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందనగా.. పశ్చిమ బెంగాల్ లో కూలీల కనీస వేతనాలను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం సాయంత్రం భారత ఎన్నికల సంఘం.. బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. దీనికి కొద్ది నిమిషాల ముందే.. దీదీ వ్యూహాత్మకంగా కూలీ రేట్ల పుంపు నిర్ణయాన్ని ప్రకటించి సంచలనానికి తెరతీశారు.
పశ్చిమ బెంగాల్ పట్టణ ఉపాధి పథకం ప్రకారం.. సాధారణ (అన్ స్కిల్డ్) కూలీకి రోజువారీ కనీస వేతనం రూ.144 రూపాలు ఉండగా దాన్నిప్పుడు రూ.202కు పెంచారు. సెమీ స్కిల్డ్ కూలీలకు రూ.172గా ఉన్న వేతనాన్ని రూ .303కు పెంచారు. ఇక కొత్త పాలసీ ప్రకారం స్కిల్డ్ లేబర్ (నైపుణ్యం కలిగిన కార్మికులకు)కు రోజుకు రూ .404 కనీస వేతంగా అందించాల్సి ఉంటుంది. దీనిపై.. కూలీల వేతనం పెంపు నిర్ణయం వల్ల మొత్తం 56,500 మంది కార్మికులు (40,500 నైపుణ్యం లేనివారు, 8000 మంది సెమీ స్కిల్డ్, 8000 మంది నైపుణ్యం కలిగినవారు) ప్రయోజనం పొందుతారు. ఈ వేతనాలు గ్రామీణ కార్మికుల మెరుగైన వేతనంతో సమానంగా ఉంటాయని, ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు పూర్తిచేశామని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ట్విట్టర్లో తెలిపారు.