మే 2న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.ఈ రాష్ట్రాల్లో మొత్తం 18.68కోట్ల ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునిల్ అరోడా వెల్లడించారు. బెంగాల్లో లక్షకు పైగా, తమిళనాడులో 89వేలు, కేరళలో 40వేలు, అసోంలో 33వేలు, పుదుచ్చేరిలో 1500 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగ కుండా ఈ ఎన్నికలను నిర్వహిస్తామని ఈసీ తెలిపారు. ఈసారి పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచనున్నట్లు తెలిపారు. పుదుచ్చేరి మినహా నాలుగు రాష్ట్రాల్లో ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.30.8లక్షలకు పెంచినట్లు సునిల్ అరోడా అన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఓటు వేసేందుకు వచ్చే కరోనా రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా దృష్ట్యా ఈ సారి ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. పరీక్షలు, పండగలు చూసే ఎన్నికల తేదీలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు 16 రాష్ట్రాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నట్లు తెలిపారు. వీటికి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల తేదీల వివరాలు..
అసోం
మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలి దశ, ఏప్రిల్ 1న రెండో దశ, ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్ నిర్వహించనున్నారు.
కేరళ
ఈ రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు.
తమిళనాడు
తమిళనాడులోనూ ఒకే విడతలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి.
పుదుచ్చేరి
పుదుచ్చేరిలోనూ ఒకే దశలో ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు.
పశ్చిమ బెంగాల్
ఈ రాష్ట్రంలో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలి దశ, ఏప్రిల్ 1న రెండో దశ, ఏప్రిల్ 6న మూడో దశ, ఏప్రిల్ 10న నాలుగో విడత, ఏప్రిల్ 17న ఐదో విడత, ఏప్రిల్ 22న ఆరో దశ, ఏప్రిల్ 26న ఏడో విడత, ఏప్రిల్ 29న ఎనిమిదో దశ పోలింగ్ జరగనున్నట్లు సీఈసీ అరోరా వ్యాఖ్యానించారు.