ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతి అంశం మళ్లీ కేంద్రంగా మారింది. అమరావతిలో పెండింగులు పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించడం ప్రాధాన్యతగా మారింది.
అమరావతిపై నటుడు శివాజి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని కోరుతూ  437 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళలకు మద్దతు తెలిపేందుకు అమరావతికి వచ్చారు శివాడి. అమరావతి ఆందోళనకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా రాజధాని అమరావతి, రైతుల దీక్ష, జగన్ పాలనపై శివాజి మాట్లాడారు.

రైతుల సంకల్పం, వారి తెగువ అమరావతిని నిలబెడతాయన్న నమ్మకం తనకుందని అన్నారు హీరో శివాజి. రాజధానిపై రైతుల్లో ఉన్న దృఢసంకల్పమే వారిని విజయతీరాలకు చేరుస్తుందని తెలిపారు. అమరావతి భావితరాల సొత్తు అని, దీన్ని ఎవరూ దొంగిలించలేరని స్పష్టం చేశారు.రాజధాని రైతులను ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని శివాజీ వ్యాఖ్యానించారు. గతంలో ఇక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని అమరావతి రైతులు కోరలేదని, ప్రభుత్వం కోరిన పిమ్మట బాధ్యతగా తమ భూములు అప్పగించారని శివాజీ వెల్లడించారు. ఇప్పుడా భూములకు విలువలేదని అంటే అది చెల్లదని అన్నారు. అమరావతి ఎక్కడికీ పోదని, ఆ విధంగా శాసనం చేయబడిందని చెప్పారు.ఇది శివాజీ చెబుతున్న మాట అని ఉద్ఘాటించారు. ఆ శాసనాన్ని బద్దలు కొట్టాలంటే అణుబాంబు వల్ల కూడా కాదని శివాజి స్పష్టం చేశారు.

అమరావతి ఎప్పటికీ ఆంధ్రుల రాజధానే అన్నారు శివాజి. అమరావతి రైతులను ఎవరూ మోసం చేయలేరని, తాను చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని, అదే సమయంలో అమరావతి రాజధాన నిర్మాణం కూడా కొనసాగాలని శివాజి ఆకాంక్షించారు.ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ పై స్పందించిన శివాజి... ప్రజాభిప్రాయాలను గౌరవించకపోతే తీవ్ర నష్టం చూడాల్సి వస్తుందన్నారు. ప్రజా పోరాటానికి ఎవరైనా తలవంచాల్సిందేనన్నారు శివాజి. అమరావతిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: