బెజ‌వాడ వైసీపీ యువ నాయ‌కుడు.. దేవినేని అవినాష్ దూకుడు పెంచారు. ఆయ‌న వైసీపీని ఎట్టి ప‌రిస్థితిలోనూ విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌లో కూర్చోబెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆదిశ‌గా అడుగులు వేస్తున్నారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను కీల‌కంగా తీసుకున్నారు. పార్టీలో నేత‌ల‌ను క‌లుపుకొని పోతున్నారు. స‌మ‌స్య‌లు రాకుండా చూసుకుంటున్నారు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్న అవినాష్‌.. త‌న‌దైన శైలిలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌తిప‌క్షం టీడీపీకి సైతం అంద‌నంత వేగంగా ఆయ‌న పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు.

త‌న‌-మ‌న‌.. అనే తార‌త‌మ్యం లేదు.. అంద‌రూ మ‌న పార్టీ వాళ్లే.. అనే స్పూర్తితో ముందుకు సాగుతున్నారు అవినాష్‌. వాస్త‌వానికి అవినాష్ ఏ పార్టీలో ఉన్నా.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు.. త‌ర్వాత టీడీపీలో తెలుగు యువ‌త నాయ‌కుడిగా ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న యాక్టివ్ పాలిటిక్స్‌ను చేప‌ట్టారు. అయితే.. ఆయ‌న రెండు పార్టీల్లోనూ ఎంపీగా, ఎమ్మెల్యేగా టికెట్లు సంపాయించుకుని పోటీ చేసినా.. ఓడిపోయారు.

ఇక‌, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీలో అడుగు పెట్టాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అయితే.. దీనికి సోపానంగా ఆయ‌న తూర్పు స‌హా బెజ‌వాడ‌లో వైసీపీని గెలుపు గుర్రం ఎక్కించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే అవినాష్ తూర్పులో అంద‌రినీ క‌లుపుకొని పోతున్నారు. నిర్విరామంగా పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లోనూ తిరుగుతున్నారు. ప్ర‌తి గ‌డ‌ప‌కు వెళ్లి.. వైసీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నారు.

క‌రోనా స‌మ‌యం నుంచి ప్ర‌తి రోజు ఆయ‌న ప్ర‌జ‌ల్లోనే ఉన్నారు. ఇక‌, పార్టీలో ఇత‌ర నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ యువ‌నేత‌గా ముందుకు దూసుకు వెళుతున్నారు. త‌న కెరీర్‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఉన్న తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో అవినాష్ ఆధ్వ‌ర్యంలో సాగుతున్న‌ప్ర‌చారం హోరెత్తుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా ఒక ల‌క్ష్య‌-ఒక కృషి-ఒక ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగుతున్న అవినాష్ ఈ పుర పోరులో ఎలా ?  స‌క్సెస్ అవుతాడో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: