కారులో డ్రైవర్ పక్కనే ఉండే సీటులో ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు వాడేటటువంటి బ్యాగ్ ఉండగా దానిలో ఈ బెదిరింపు లేఖ బయటపడింది. ఇందులో ముఖేష్ అంబానీతో పాటు నీతా అంబానీని సైతం దుండగులు బెదిరించారు.అంబానీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ రాసిన ఈ లేఖలో "నీతా అంబానీ, ముఖేష్ భయ్యాకు ఇదొక ఝలక్. మరోసారి ఈ పేలుడు పదార్థాలు మీ దగ్గరికి చేరుకుంటాయి. ఇది ట్రయిలర్ మాత్రమే" అని రాసుందని ముంబై పోలీసు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.
ముఖేష్ అంబానీ ఇంటి బయట ఆగివున్న ఓ స్కార్పియోపై అనుమానంతో సోదాలు చేయగా, పేలుడు పదార్థాలు లభించాయి. ముఖేష్ కుటుంబం వాడే సెక్యూరిటీ వాహనం నంబర్ ఈ స్కార్పియోకు ఉంది. దీంతో ఈ వాహనాన్ని ఎక్కడో దొంగిలించి తెచ్చుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వాహనంలో వచ్చిన వ్యక్తి మరో వాహనంలో వెళ్లిపోయాడని ఇప్పటికే గుర్తించిన ముంబై పోలీసులు, ఈ కేసును సీరియస్ గా తీసుకుని ఆగంతుకులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.ఈ ఘటన ముంబైతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా లభించిన బెదిరింపు లేఖ మరింత దుమారం రేపుతోంది. ఈ ఘటన వెనక ఎవరున్నారో తేల్చేందుకు ముంబై పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అంబానీ నివాసమైన 'అంటీలియా' పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు.