బెజవాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు తగ్గలేదు. నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడంలేదు. నేతలను బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. 39వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య గొడవలు రేగుతున్నాయి. చివరకు నాని సూచించిన శివశర్మ పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఆ తర్వాత బుద్దా వెంకన్న, నాగుల్ మీరాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలిపించి బుజ్జగించారు. అందరి అభిప్రాయాల మేరకు 39వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శివశర్మ పేరును ఖరారు చేశారు.
39వ డివిజన్ సమస్య సుఖాంతంగా ముగిసింది అనుకునేంతలో బెజవాడలో మరో డివిజన్ చిచ్చురేపుతోంది. 11వ డివిజన్ నుంచి కేశినేని నాని కుమార్తె శ్వేత కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా శ్వేతను దాదాపుగా ఖరారు చేయడంతో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో తూర్పు నియోజకవర్గం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన వారికి మేయర్ అభ్యర్థి పదవి ఇచ్చారని, ఈ సారి సెంట్రల్ నియోజకవర్గం నుంచి వేరే సామాజికవర్గానికి మేయర్ పదవి ఇవ్వాలని ఉమ వాదిస్తున్నారు. దీంతో పార్టీ నేతలు లోకేష్, అచ్చెన్నాయుడు నచ్చచెప్పడంతో ఉమ సానుకూలత వ్యక్తం చేశారు. అయితే 30వ డివిజన్లో గోగుల రమణను కాకుండా గరిమెళ్ల చిన్నాను అభ్యర్థిగా రంగంలోకి దించాలని బొండా ఉమ ప్రతిపాదించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ వర్గాలు ఎంపీ కేశినాని నానితో మాట్లాడుతున్నారు.
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలపై కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులోభాగంగానే పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విభేదాలన్న ఐదు వార్డుల అభ్యర్థులను పిలిపించి మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థులందరీతో మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాకు, ఇతర నేతలకు ఆయన సూచించారు.