వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పదిలంగానే ఉంది. కానీ.. ఎటొచ్చీ.. కొంత మేరకు తగ్గింది. రాష్ట్రాన్ని విభజిం చారనే కొపం కావొచ్చు.. లేదా.. వైసీపీ దూకుడు కావొచ్చు.. వెరసి.. కాంగ్రెస్కు ఓటు బ్యాంకు తగ్గింది. ఇక, కార్పొరేషన్లు, నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కు 5 శాతం ఓట్లు పడ్డాయి. కానీ, కార్పొరేషన్లు, నగర పాలక సంస్థల విషయంలో మాత్రం కేవలం 1 శాతం కూడా దాటలేదు.
ఈ నేపథ్యంలో జరిగిన రెండేళ్లలో నూ పార్టీ ఏమన్నా పుంజుకుందా ? అంటే.. అది కూడా కనిపించడం లేదు. శక్తిమంతమైన కేడర్ ఉన్నా.. పార్టీ నాయకులు ఇప్పటి వరకు ప్రజల్లోకి వెళ్లింది లేదు. కానీ, గెలుపుపై మాత్రం ఆశలు కోటలు దాటుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నాయకులు వేసుకున్న అంచనాల మేరకు నగరమునిసిపాలిటీల్లో సత్తా చాటుతామనే. అదే సమయంలో విజయవాడ, విశాఖ వంటి కార్పొరేషన్లలో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షాలకు దీటుగా ఎదుగుతామని... కూడా చెబుతున్నారు.
అయితే.. దీనికి తగిన కసరత్తు ఎక్కడా కనిపించడం లేదు. కాంగ్రెస్ జెండాలు విజయవాడ సహా విశాఖలోనూ ఎక్కడా కనిపించడం లేదు. ఈ జెండాలు కనిపిస్తున్న చోట.. పార్టీ నాయకులు లేరు.. నాయకులు ఉన్న చోట.. జెండాలు కనిపించడం లేదు.కానీ.. కాంగ్రెస్ మాత్రం ఆశల పల్లకిలో ఊరేగుతుండడం గమనార్హం. మరి అనూహ్యంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నట్టు కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమైనా సత్తా చాటుతుందేమో చూడాలి.