తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి భక్తలు తరిలివస్తుంటారు. అయితే వెంకన్న దర్శనార్థం వచ్చే భక్తులకు కొత్తగా మోతబరువు పడింది. అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ మేరకు టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుమలకు వెళ్లే వాహనాలన్నీ అలిపిరి వద్ద ఉన్న ఈ టోల్‌గేట్ మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టోల్‌గేట్ వద్ద వసూలు చేస్తోన్న ఛార్జీలను టీటీడీ అధికారులు భారీగా పెంచారు.

అయితే సగటున రోజూ 10 వేలకు పైగా వాహనాలు ఈ టోల్‌గేట్ మీదుగా తిరుమలకు వెళ్తుంటాయని అధికారులు అంచనా వేశారు. ఇక వారాంతపు రోజులు, పండుగలు ఇతర ప్రత్యేక దినాల్లో ఈ వాహనాల సంఖ్య భారీగా ఉంటుంది. ఆయా వాహనాల నుంచి టోల్ ఛార్జీలను వసూలు చేయడానికి అలిపిరి వద్ద ప్రత్యేక వ్యవస్థను టీటీడీ అధికారులు ఇదివరకు ప్రవేశపెట్టారు. నామమాత్రంగా వాహనాల ఛార్జీలను వసూలు చేస్తుండేవారు. దశలవారీగా ఆ ఛార్జీలను పెంచుకుంటూ వచ్చారు. ఈ సారి భారీగా పెంచారు.

తిరుమలేశుడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వాహనాల మీద వచ్చే భక్తులకు ఈ చార్జీల పెంపు పెనుభారంగా మారింది. ఇక ఇప్పటిదాకా అమల్లో ఉన్న టోల్ ఛార్జీల ప్రకారం.. భక్తులు రాకపోకలు సాగించే వ్యక్తిగత కారుపై 15 రూపాయల నామమాత్రపు ఛార్జీని వసూలు చేసే వారు. ఇప్పుడిది 50 రూపాయలకు పెంచారు. టాక్సీపై 25 రూపాయలు, సొంత జీపుపై వచ్చే వారి నుంచి రూ.30 తీసుకునే వారు.

అంతేకాక ట్యాక్సీ, సుమో, ట్రాక్స్ వంటి కమర్షియల్ వాహనాలపై శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల నుంచి 50 రూపాయల ఛార్జీని వసూలు చేస్తుండేవారు. హెచ్‌బీ మినీ లారీ-50, రాష్ట్ర పర్యాటకాభివ‌ద్ధి సంస్థకు చెందిన బస్సులపై గరిష్ఠంగా 100 రూపాయల ఛార్జీని విధించే వారు. ఇప్పడవన్నీ పెంచారు. శ్లాబులు, వాహనాలవారీగా టోల్‌గేట్ ఛార్జీలో పెరుగుదల నమోదైంది. కనిష్ఠంగా 50 రూపాయలు, గరిష్ఠంగా 200 రూపాయలను ఇకపై వసూలు చేస్తారు. ఈ టోల్ గేట్.. టీటీడీ సెక్యూరిటీ విభాగం ఆధీనంలో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: