జెసిండా అర్డెన్..! ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో బంధీ అయి విలవిల్లాడుతున్న సమయంలో.. తన దేశాన్ని వైరస్ నుంచి కాపాడుకున్న లీడర్..! న్యూజిలాండ్ వ్యాప్తంగా కట్టుదిట్టమైన లాక్డౌన్.. బోర్డర్లను మూసివేసి.. వైరస్ కేసులు పెరగకుండా చూసుకున్నారు. చాలా దేశాలు ఇంకా కరోనాతో పోరాడుతున్న సమయంలోనే.. తమ దేశం వైరస్ ఫ్రీ అని ప్రకటించారు. ప్రపంచంలోనే వైరస్ కట్టడిలో ది బెస్ట్ అనిపించుకున్న న్యూజిలాండ్లో ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారుతోంది.
ఆక్లాండ్లో తాజాగా ఓ కేసు బయటికి రావడంతో వారం రోజుల పాటు లాక్డౌన్ విధించారు. ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్ రావడంతో అతన్ని ఐసోలేట్ చేశారు. ఇంకా ఎవరెవరికి వైరస్ వ్యాపించింది అనే దానిపై కూపీ లాగుతున్నారు. అంతేకాదు.. అసలు ఎక్కడి నుంచి వైరస్ వచ్చింది..? దీనికి మూలం ఏంటన్న దానిపై కూడా న్యూజిలాండ్ వైద్య అధికారులు దృష్టి సారించారు. ఇక దేశవ్యాప్తంగా లెవల్-2 ఆంక్షలు కొనసాగుతున్నాయ్. ఆక్లాండ్లో మాత్రం లెవల్-3 ఆంక్షలు ఉన్నాయి. అంటే జనసమూహాలు, పబ్లిక్ మీటింగ్లపై నిషేధం ఉంటుంది. కేవలం అత్యవసరాల కోసమే బయటికి రావాలన్న ఆదేశాలు ఉన్నాయి.
వచ్చే శుక్రవారం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య ఆక్లాండ్లో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే లాక్డౌన్ విధించడంతో ఈ మ్యాచ్ వెల్లింగ్టన్కు మార్చారు. కరోనా కారణంగా అభిమానులకు అనుమతి ఇవ్వకుండా మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఆక్లాండ్లో దాదాపు 20 లక్షల మంది జనభా ఉంటుంది. ఫిబ్రవరి మధ్యలోనే మూడు రోజుల పాటు లాక్డౌన్ విధించారు. ఇప్పుడు మరోసారి. ఇప్పటికే న్యూజిలాండ్ వ్యాప్తంగా 12కి పైగా కేసులు నమోదు అయ్యాయి.
యూకే స్ట్రెయిన్ కారణంగానే కేసులు పెరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభించడం మొదలు పెట్టిన తర్వాత న్యూజీలాండ్లో ఇప్పటివరకు కేవలం 2300 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఎంత పకడ్బంధీగా కట్టడి చర్యలు తీసుకుంటున్నా.. కరోనా మహమ్మారి విజృంభణ మాత్రం ఆగడం లేదు.