కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ దిశగా అమెరికాలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ రూపొందించిన కొవిడ్‌ టీకాకు... అమెరికాలో అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర పడింది. అమెరికాలో ఇప్పటికే కరోనా కారణంగా 5 లక్షలకు పైగా అమెరికన్లు మరణించారు. దీంతో టీకా పంపిణీ మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది.

కరోనా నుంచి జే అండ్‌ జే టీకా సమర్థవంతమైన రక్షణ కల్పిస్తుందని ఎఫ్‌డీఏ తెలిపింది. మూడు వేర్వేరు ఖండాల్లో ప్రయోగించి ఫలితాలను అధ్యయనం చేశామన్న ఎప్‌డీఏ.. తీవ్రత ఎక్కువగా ఉన్న కొవిడ్‌-19 కేసుల్లోనూ ఈ టీకా 85శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపింది. మార్పులు కరోనా వైరస్‌ల్లో దక్షిణాఫ్రికా రకంపై కూడా దీని ప్రభావం ఆశాజనకంగా ఉంది. కరోనా వైరస్‌ నిరోధానికి ఇతర టీకాలు రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, కేవలం ఒక డోసుతోనే ఈ టీకా ఆస్థాయిలో పనిచేయడం విశేషం' అని ఎఫ్‌డీఏ పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికా అంటువ్యాధుల విభాగం నిపుణుడు ఆంటోనీ ఫౌచీ స్పందించాడు.  'అధిక రక్షణ సామర్థ్యం కలిగిన టీకాలనే మేం వాడుకలోకి తెస్తున్నాం'అని తెలిపారు.

ఈ టీకా నేటి నుంచి పలు రాష్ట్రాలకు సరఫరా కానున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, అమెరికాలో మార్చి చివరి నాటికి 2కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని జే అండ్‌ జే సంస్థ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ సంస్థ ఇప్పటికే యూరప్‌లోనూ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకొంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల‌ డోసుల ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టీకా తొలిసారిగా గురువారం నాడు బహ్రైన్‌లో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందింది. అమెరికాలో ఇప్పటికే ఫైజర్‌-బయో ఎన్‌టెక్‌, మోడెర్నా టీకాలు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి కరోనా అంతు చూసేందుకు పలు దేశాలు ఇప్పటికీ శ్రమిస్తూనే ఉన్నాయి. కానీ కరోనా మాత్రం కొన్ని దేశాల్లో విస్తరించుంటూ పోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: