ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న స్టేట్ హైవేలను, నేషనల్ హైవేలుగా మార్చాడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అదే జరిగితే ఇప్పుడున్న స్టేట్ హైవేస్ పై కూడా టోల్ గేట్లు వచ్చి చేరుతాయి. అంటే ఇకపై ఏ రోడ్డులో వెళ్లాలన్నా టోల్ ఫీజు చెల్లించాల్సిందే అనమాట. అయితే రాష్ట్ర రహదారులపై కూడా టోల్ గేట్లు పెట్టాలని ఆల్రడీ ప్రభుత్వం నిర్ణయించడంతో.. పేరు మారినా, మారకపోయినా ఏపీ ప్రజలకు టోల్ బాదుడు మాత్రం తొలగిపోయేలా కనిపించడంలేదు.

రాష్ట్రంలో 7 స్టేట్‌ హైవేలను నేషనల్‌ హైవేలు‌గా మార్చేందుకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దీంతో మరో రెండు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని ఏపీ ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్ ‌పోర్టు అండ్‌ హైవేస్‌ కు లేఖ రాసింది. రాయలసీమలో ‌ కడప, కర్నూలు, అనంతపురంలలో రెండు రహదారులపై ట్రాఫిక్‌ పెరిగినందున జాతీయ రహదారులుగా గుర్తింపు ఇవ్వాలని లేఖలో కోరింది. జమ్మలమడుగు–నంద్యాల, కొడికొండ చెక్ ‌పోస్టు–ముద్దనూరు–కదిరి రాష్ట్ర రహదారులను నేషనల్ హైవేలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. ఈ రహదారులపై నిత్యం ఏడు వేల ప్యాసింజర్‌ కార్‌ యూనిట్లు వెళ్తున్నందున ట్రాఫిక్‌ పెరిగిందని, అందుకే జాతీయ రహదారులుగా మార్చి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆ లేఖలో కోరింది.

ఇప్పటికే మూడు రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల నంబర్లను కేటాయిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ, ఏపీలను కలిపే విధంగా మహబూబ్‌ నగర్, కర్నూలు జిల్లాల మధ్య ఎన్.‌హెచ్.‌–67 జంక్షన్‌ వద్ద నాగర్‌కర్నూల్, కోలాపూర్, రామాపూర్, మండుగల, శివాపురం, కరివెన, నంద్యాల వరకు ఉన్న 94 కి.మీ. రోడ్డును ‘ఎన్‌.హెచ్.‌–167కే’గా గుర్తించారు.

అనంతపురం జిల్లా పరిధిలోని ఎన్.‌హెచ్.‌–44పై కోడూరు నుంచి ముదిగుబ్బ, పుట్టపర్తి మీదుగా వెళ్లే 79 కిలోమీటర్ల రాష్ట్ర రహదారికి ఎన్‌.హెచ్.‌–342 నెంబర్ కేటాయించారు. కడప జిల్లా పరిధిలో రాయచోటి–వేంపల్లె–యర్రగుంట్ల–ప్రొద్దుటూరు–చాగలమర్రి వరకు ఉన్న 130 కిలోమీటర్ల రోడ్డును కూడా జాతీయ రహదారిగా గుర్తించారు. దీనికి 440నెంబర్ కేటాయించారు. ఇలా రాష్ట్రంలోని రహదారులను నేషనల్ హైవేలుగా మార్చేస్తూ, సౌకర్యాలు, మెయింటెనెన్స్ పేరుతో టోల్ గేట్లు పెట్టేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: