ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈరోజు రేపట్లో నామినేషన్ ల ఉపసంహరణ ముగియనుంది. ఈ నేపధ్యంలో రెబెల్స్ బెడద ఎక్కువగా ఉన్న అనంతపురం జిల్లాకు ఇన్ ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా వెళ్ళారు. అనంతపురం, పుట్టపర్తిలలో నేతలతో కీలక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అధికార పక్షానికి, ప్రతిపక్షానికి పోటీ ఉంటుంది. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం వైసీపీ వర్సెస్ వర్సెస్ అనే విధంగా ఉన్నాయి సమీకరణాలు. పంచాయతీ ఎన్నికల్లో ఈ తీరుతోనే చాలా స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. 

అయితే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలోనే వైసీపీ నుంచి చాలా చోట్ల ఒకే వార్డులో ఇద్దరు ముగ్గరు నేతలు బరిలో దిగారు. దీంతో ఒక్క మున్సిపాలిటీ పరిధిలోని నేతలతో విడివిడిగా సమావేశం అయ్యారు బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రధానంగా అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం, తాడిపత్రి ప్రాంత నేతలతో అనంతపురం కేటీఆర్ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఎందుకిలా రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్నారనే దానిపై చర్చలు జరిపారు. అయితే ఇప్పటికే పార్టీ దృష్టిలో ఉన్న నేతలతో పాటు ఎమ్మెల్యేల సూచనలతో పేర్లను ఖరారు చేశారు. 

వారికి బీఫామ్ ఇస్తున్నామని.. మిగిలిన వారు తప్పుకోవాలని సూచించారు. కాదు కూడదు అంటే పార్టీ యాక్షన్ తీసుకుంటుందని అన్నారు. అలాగే పుట్టపర్తిలో జరిగిన సమావేశంలో హిందూపురం, కదిరి రెబల్ అభ్యర్థుల గురించి చర్చించి క్యాండెట్ లీస్ట్ ఫైనల్ చేశారు. రెబల్ అభ్యర్థులు మాత్రమే కాదు.. పార్టీలో ఉంటూ అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతపురం, కళ్యాణదుర్గం, హిందూపురం లాంటి ప్రాంతాల్లో విబేధాలు  ఉన్నాయి. ఇప్పుడు అధిష్టాన పెద్దలు ఇచ్చిన క్లాస్ తో అయినా అవి సమిసిపోతాయా... లేక మున్సిపల్ ఎన్నికల్లో తేడా తీసుకొస్తాయా అన్నది చూసాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: