కొద్దికాలంగా ఈటెల రాజేందర్ తిరుగుబావుట ఎగురవేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా దోహదం చేస్తున్నాయి. రెండోసారి టీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా చాలా రోజుల పాటు ఈటెలను వెయింట్ లిస్టింగ్లో పెట్టారు కేసీఆర్. ఆ తర్వాత పరిస్థితి వేరే రకంగా మారుతోందని గ్రహించి ఆరోగ్యశాఖకు మంత్రిగా నియమించారు. అయితే కొన్నాళ్లకే ఆయన తీవ్రస్తాయిలో ఓ వేదికపై నుంచి స్పందించారు. మంత్రి పదవి ఎవరి భిక్ష కాదన్నారు. అధికారం శాశ్వతం కాదు..ధర్మం, న్యాయమే శాశ్వతమన్నారు ఈటెల. చిల్లర ప్రచారానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
మొదటి నుంచీ ఉద్యమంలో ఉన్నానని.. మధ్యలో వచ్చిన వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తాము గులాబీ జెండా ఓనర్లమన్నారు. అడుక్కునే వాళ్లం కాదని ఆవేశంగా మాట్లాడారు మంత్రి ఈటెల. ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప నాయకులు కాదన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు ఒక్కరు నిరూపించినా… రాజకీయాలను నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. తనను ఓడించాలని దొంగల గుంపు తయారై మీటింగ్ లు పెట్టుకుని రక రకాల ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ విముక్తి కోసం కోట్లాడినట్లు గుర్తు చేశారు. న్యాయం, ధర్మం నుంచి తప్పించుకోలేరని.. ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు.