సుమారు 70 లక్షలకు పార్టీ సభ్యత్వం చేరిందని సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేటీఆర్ వెల్లడించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై తెలంగాణ భవన్ లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పార్టీ కమిటీల నిర్మాణంపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. ఈ నెలాఖరు వరకు టిఆర్ఎస్ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నప్పటికీ సభ్యత్వాల నమోదు చురుగ్గా కొనసాగుతోందని..ఒక్కో నియోజకవర్గంలో కనీసం 50 వేల నుంచి సుమారు లక్ష వరకు సభ్యత్వాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
వాస్తవానికి గతంలో సభ్యత్వాల నమోదుకు పెద్దగా హడావుడి కనిపించకపోయేది. సభ్యత్వ నమోదును నామమాత్రంగా నడిపించిన పార్టీలు.. ఇప్పుడు పోటాపోటీగా మెంబర్షిప్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ప్రమాద బీమా కల్పిస్తమంటూ, కేవలం సెల్ఫోన్ నుంచి మిస్స్డ్ కాల్ ఇస్తే చాలంటూ సభ్యత్వ నమోదు కోసం జనం వెంటపడుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ భారీగా సభ్యత్వాల నమోదుపై ఫోకస్ పెట్టాయి. వరుసగా అన్ని స్థాయిల ఎన్నికలు ముగియడం, చివరిగా మున్సిపల్ ఎలక్షన్లు వస్తుండటంతో పార్టీలను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. గతంలో కంటే మెంబర్షిప్ను పెంచుకోవాలని, 80 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.