ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున తమ పార్టీలోకి వలసలు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢంకా బజాయిస్తున్నారు. నిత్యం ఏదో ఒక డివిజన్/వార్డులో బహిరంగ సభలు ఏర్పాటు చేసి తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ, జనసేన నుంచి వైసీపీలోకి పలువురు చేరుతున్నట్లు చెబుతున్నారు. అయితే వైసీపీ నాయకులు చెబుతున్న వారెవ్వరూ తమ పార్టీలో ఏనాడూ క్రియాశీలకంగా లేరని, ప్రజల్ని ఆకర్షించుకోవడానికి, ఓట్ల కోసం ఆ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్లో భాగమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇవన్నీ చీప్ ట్రిక్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు.
గుంటూరు నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న చీప్ ట్రిక్గా ప్రతిపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. అభివృద్ధి పడకేయడం, రేషన్కార్డుల తొలగింపు, ఇంటిపన్ను పెంచబోతుండటం వంటి కారణాలతో వైసీపీ ప్రభుత్వంపైప్రభుత్వపరంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఈ రెండేళ్లలో వదిలేశారని, ఎక్కడ అభివృద్ధి జరగలేదని అడుగుతారోననే భయం ఆ పార్టీ నేతల్లో ఉందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పట్టణ ప్రాంలత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, దాని నుంచి దృష్టి మళ్లించేందుకు ఇలా బోగస్ చేరికల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని టీడీపీ, బీజేపీ, జనసేన విమర్శిస్తున్నాయి.
మునిసిపల్ ఎన్నికల పోలింగ్ 10వ తేదీన జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 8వ తేదీ సాయంత్రం వరకే ప్రచారాలకు అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా వైసీపీ అభ్యర్థులు గుంటూరు నగరంతో పాటు మునిసిపాలిటీల్లో ఓటర్లను ఏమార్చేందుకు ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరుతున్నారని పేర్కొంటూ వారి ఫొటోలు, పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం వేళ నాయకులను పిలిపించి వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చి టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి నాయకులు తమ పార్టీలోకి చేరుతున్నారని సభలు నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు చెబుతున్న ఇతర పార్టీల కార్యకర్తల పేర్లు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వారంతా అప్పటికే వైసీపీలో ఉన్నవారే.. సంబంధిత నేతాగణం అనుచరులే.