అధికారమే అండగా అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామనే విషయాన్ని వారు మరిచిపోయినట్లున్నారు. నియంతృత్వ దేశంలో ఉన్నట్లు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. పురపాలక సంఘ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ గెలిపించుకోవడం కోసం ఎంతకైనా తెగించేలా.. ఎంతదూరమైనా ప్రయాణించేలా ఆ పార్టీ నేతల తీరు ఉంది. అన్నిచోట్లా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పురపాలక సంఘాలపై తమ పార్టీ జెండా రెపరెపల కోసం ఎన్నో కుయుక్తులు.. మరెన్నోబెదిరింపులు.. ఇంకెన్నో ప్రలోభాల పర్వాలు..
ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాజకీయంగా హైడ్రామా సాగుతోంది. అందుకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత ఒకరు వెనుకడుగు వేయటమే. ఆ నేత వైఫల్యాన్ని గుర్తించి మొత్తం మున్సిపాలిటీలోని అన్ని వార్డులను ఏకగ్రీవం చేసి చైర్మన్ పదవి పొందే దిశగా వైసీపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత పాలకమండలిలో మున్సిపల్ చైర్పర్సన్ భర్తగా చక్రం చక్రం తిప్పిన టీడీపీ నేతను సైలెంట్ చేసినట్లు కనిపిస్తోంది. కాంట్రాక్టర్ అయిన ఆయన టీడీపీ ముఖ్యుల సమావేశానికే రాలేదు.
పార్టీ ఇన్ఛార్జ్ అయిన మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తనకు ఆర్థిక వనరులు సహకరించటం లేదని, మాజీ చైౖర్మన్ కూడా రాకపోవటంతో పరిస్థితి క్లిష్టంగా మారిందని చెప్పినట్లు తెలిసింది. దీనికి తోడు వైసీపీ, టీడీపీ ముఖ్య నాయకుల మధ్య ఒప్పందాలు జరిగాయన్న ప్రచారం ఉంది. ఈ పరిస్థితిని అలుసుగా తీసుకుని వైసీపీ నాయకులు వార్డుల్లో నామినేషన్లు వేసిన ఇతరులందరితోను మంతనాలు ప్రారంభించారు. టీడీపీనే పోటీలో లేకపోతే మీకు ఇబ్బంది ఏమిటి? తలా ఒక డివిజన్ తీసుకోండంటూ వామపక్షాలు, బీజేపీతో కూడా వారు మంతనాలు సాగిస్తున్నారు.
స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వం మెతకవైఖరితో కొంతమంది నామినేషన్లు వేసినవారు ఏకగ్రీవ ఎంపికకు అంగీకారం కూడా తెలిపినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పార్టీ అధిష్ఠానం మన అభ్యర్థులు పోటీలో ఉండాలి, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ పార్టీ లోక్సభ అధ్యక్షుడు బాలాజీకి ఆదేశాలు జారీచేసింది. ఆయన విషయాన్ని నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నారాయణరెడ్డితో కూడా కొందరు నేతలు మాట్లాడినట్లు సమాచారం.