పురపాల‌క సంఘాల‌ సమరానికి గడువు సమీపిస్తోంది. న‌గ‌ర‌, పట్టణ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఎన్నికల హడావుడి వేగవంతమైంది. వైసీపీ, తెలుగుదేశం పార్టీ మ‌ధ్య పోటీ నువ్వా-నేనా? అన్న‌ట్లుగా మారింది. అధికార పార్టీ అయితే ప్ర‌తిప‌క్షం నుంచి, ప్ర‌తిప‌క్ష పార్టీ అయితే అధికార పార్టీ నుంచి పోటీ ఉంటుంది. కానీ ఇక్క‌డ అధికార పార్టీకి సొంత పార్టీ రెబ‌ల్స్ నుంచే బెడ‌ద ఎక్కువైంది. వారికి న‌చ్చ‌చెప్పాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాలు కొలిక్కి రావ‌డంలేదు. ఏం చేయాలో అర్థంకాని నేత‌లు త‌ల‌లు ప‌ట్టుక్కూర్చున్నారు.

నెల్లూరు జిల్లాలో ఎన్నికల జరగనున్న నాలుగు మున్సిపాలిటీల్లో పోటీ నువ్వా.. నేనా అన్నట్లుగా మారింది. ముఖ్యంగా ఆత్మకూరు వైసీపీలో రెబల్స్‌ బెడద తీవ్రంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదివారం ఒక వర్గానికి చెందిన నేతలను పిలిచి నచ్చచెప్పాలని  చేసిన ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. కొన్ని వార్డుల్లో తమ వర్గీయులను బరిలో నుంచి తప్పించేందుకు అంగీకరించడంలేదు.  నామినేషన్లు వేయించాం.. ఇప్పుడు ఉపసంహరించుకోవాలంటే కుదరదు. అని తేల్చిచెపుతున్న‌ట్లు  సమాచారం. నామినేషన్ల ఉపసంహరణకు గడువు సమీపించింది. మంగళవారం నుంచి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రక్రియ ముగియ‌నుంది. రెబ‌ల్స్ గొడ‌వ స‌ద్దుమ‌ణిగే అవ‌కాశాలు క‌న‌ప‌డ‌టంలేదు.

ఆత్మకూరు మున్సిపాలిటీలోని 23 వార్డుల‌కు వైసీపీ అభ్యర్థులు 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో పార్టీ గుర్తించిన అభ్యర్థులతోపాటు కొందరు రెబల్‌ అభ్యర్థులూ ఉన్నారు. ఇటీవల  వైసీపీ నేతలు మున్సిపాలిటీలో గెలుపు గుర్రాలపై సర్వే చేయించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ సర్వే ఆధారంగా అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేస్తారని తెలిసింది.  దీంతో కొన్ని వార్డుల్లో డమ్మీ  అభ్యర్థులకే టికెట్‌ దక్కే అవకాశాలున్నాయి. నామినేషన్‌ ఉపసంహరణకు ఒక వర్గం నేతలు ససేమిరా అంటున్నారు. తమకు గెలిచే సత్తా ఉందని బి-ఫారం ఇప్పించాలని మంత్రిని కోర‌గా ఆయ‌న‌ అంగీకరించలేదని సమాచారం. దీంతో ఎవ‌రికివారే తాడో పేడో తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. త‌మ‌బ‌ల‌మేంటో గెలిచి నిరూపించుకుంటామంటూ మంత్రికే స‌వాల్ విసిరిన‌ట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: